రేవంత్, భట్టిపై జగ్గారెడ్డి గరం గరం, అందుకు వారిదే బాధ్యత అంటూ
మర్రి శశిధర్ రెడ్డి బీజేపీలో చేరికకు రంగం సిద్దమైంది. అమిత్ షాతో సమావేశంలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. దీనిపై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి స్పందించారు. మర్రి శశిధర్ రెడ్డి పార్టీ మారితే రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్కలే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. పార్టీకి ఎలాంటి నష్టం వాటిల్లినా మహేశ్ గౌడ్దే బాధ్యత అని పేర్కొన్నారు.
మునుగోడు ఓటమిపై పీసీసీ జూమ్ మీటింగ్ కు ఆహ్వానం పంపడంపై జగ్గారెడ్డి మండిపడ్డారు. ఇదీ ముమ్మాటికీ కరెక్ట్ కాదన్నారు. రేవంత్ రెడ్డి చేసేంది వంద శాతం తప్పు అని, జూమ్ మీటింగ్ పెట్టడం సరికాదన్నారు. ఇదేమైనా కంపెనీ అయితే ఇళ్లలో కూర్చుని మాట్లాడుకోవచ్చని, ఇది పార్టీ అని పేర్కొన్నారు. మునుగోడు ఓటమిపై పీసీసీ ఒక్క సమీక్ష కూడా ఎందుకు నిర్వహించలేదని ప్రశ్నించారు.
గాంధీభవన్ లో సమావేశమై చర్చించేలా రేవంత్ రెడ్డి చూడాలని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీలో కొంత ఇబ్బందికర వాతావరణం ఉన్న మాట వాస్తవమేనని అంగీకరించారు. అందులో తనకు కూడా బాధ్యత ఉందని తెలిపారు. ఆ తప్పులను సరిదిద్దుకోవాల్సి ఉందని జగ్గారెడ్డి కామెంట్ చేశారు.
గత నాలుగు నెలలుగా రాష్ట్ర కార్యనిర్వాహక కమిటీ సమావేశం జరపలేదని జగ్గారెడ్డి ఆరోపించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లను సమన్వయం చేయకపోవడం పీసీసీ తప్పు అని స్పష్టం చేశారు. పాదయాత్రలో వన్ మ్యాన్ షోలా? అంటూ రేవంత్ తీరును కూడా తప్పుపట్టారు. అందరినీ కలుపుకోని పోవాలని సూచించారు.