హుజురాబాద్ బై పోల్: బీజేపీ ఇంచార్జీగా జితేందర్ రెడ్డి.. ఇద్దరు సహా ఇంచార్జీలు కూడా..
హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్, బీజేపీ మధ్య ప్రధాన పోటీ నెలకొంది. మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరిన తర్వాత..రాజకీయ పరిణామాలు మారిపోతున్నాయి. ఇప్పటికే పలువురు టీఆర్ఎస్ నేతలు అక్కడ మకాం వేసి వ్యూహాలు రచిస్తున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక ఇన్ ఛార్జ్గా మాజీ ఎంపీ జితేందర్ రెడ్డిని బీజేపీ పార్టీ నియమించింది. సహ ఇంఛార్జ్లుగా మాజీమంత్రి ఎ చంద్రశేఖర్, యెండల లక్ష్మీనారాయణను ఎంపిక చేశారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అధ్యక్షత జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈటల రాజేందర్, తరుణ్ చుగ్తో పాటు ముఖ్య నేతలు సమావేశంలో పాల్గొన్నారు. ఎలాంటి ప్రణాళికలతో ముందుకెళ్లాలనే దానిపై చర్చించారు. తెలంగాణలో అవినీతి పరులు ఓడిపోతారని తెలంగాణ బీజేపీ ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ అన్నారు. రైతులను.. యువకులను కేసీఆర్ మోసం చేశారని విమర్శించారు. ఈ ఎన్నికలో ఈటల రాజేందర్ తప్పక గెలుస్తారని జోస్యం చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో వారసత్వ రాజకీయాలను అంతం చేస్తామన్నారు.
Recommended Video
తెలంగాణ అమరవీరుల ఆశయాలకు విరుద్ధంగా రాష్ట్రంలో పాలన సాగుతోందని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. టీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి కుంటుపడిందని మండిపడ్డారు. బీజేపీలో చేరిన తర్వాత మొదటిసారి రాష్ట్ర కార్యాలయానికి వచ్చిన మాజీ మంత్రి ఈటల రాజేందర్కు.. పార్టీ నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. ఈటల రాజేందర్ చేరికతో బీజేపీ బలపడుతుందని బండి సంజయ్ అన్నారు. టీఆర్ఎస్లో నిజమైన ఉద్యమకారులు లేరని.. అంతా అప్పుడు విమర్శించిన వారే ఉన్నారని ధ్వజమెత్తారు.