కేసీఆర్ దత్తపుత్రిక ప్రత్యూష నిశ్చితార్థం: వరుడి గురించి తెలుకుని కేసీఆర్ సంతోషం
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దత్త పుత్రిక ప్రత్యూష త్వరలోనే ఓ ఇంటి కోడలు కాబోతోంది. కన్నతండ్రి, పినతల్లి వేధింపులతో కొనఊపిరితో ఆస్పత్రిలో చేరిన ఆ అమ్మాయి బాధలు విని చలించిపోయారు సీఎం కేసీఆర్. ఈ క్రమంలో ప్రత్యూషను తాను దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు.

ప్రత్యూషకు పెళ్లి కల..
ప్రత్యూషను తమ ఇంటికి పిలిపించుకున్న సీఎం.. ఆమెతో కలిసి భోజనం కూడా చేశారు. ప్రత్యూష సంరక్షణ బాధ్యతను ఐఏఎస్ అధికారి రఘునందన్ రావుకు అప్పగించారు. ఆయన పర్యవేక్షణలో మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రత్యూష్ బాగోగులు చూస్తోంది. ఐదేళ్లలో ఆరోగ్యపరంగా ఆమె బాగా మెరుగైంది. విద్యలోనూ రాణించింది.
ఈ నేపథ్యంలో తనకు నచ్చిన వ్యక్తితో ఏడడుగులు వేసేందుకు సిద్ధమైంది ప్రత్యూష.

రాంనగర్ యువకుడితో నిశ్చితార్థం..
కాగా, ఆదివారం హైదరాబాద్ విద్యానగర్లోని ఓ హోటల్లో రాంనగర్ ప్రాంతానికి చెందిన మమత, మర్ రెడ్డి దంపతుల కుమారుడు చరణ్ రెడ్డితో ప్రత్యూష నిశ్చితార్థం నిరాడంబరంగా జరిగింది. ప్రస్తుతం చరణ్ రెడ్డి ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నాడు.
ప్రత్యూష గురించి తెలుసుకున్న చరణ్.. ఆమెను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆ తర్వాత ఇదే విషయాన్ని ఆమె వద్ద ప్రస్తావించగా ఆమె అంగీకరించారు.

వరుడి గురించి విని కేసీఆర్ సంతోషం..
ఈ క్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సీఎం కేసీఆర్ దృష్టికి రావడంతో ప్రత్యూషను ప్రగతి భవన్ పిలిపించుకుని మాట్లాడారు. ప్రత్యూష పెళ్లాడబోయే యువకుడు చరణ్ రెడ్డి వివరాలను తెలుసుకుని సంతోషం వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్.. ఆమె నిశ్చాతార్థానికి ఏర్పాట్లు చేయాలని శిశు సంక్షేమ శాఖ కమిషనర్ దివ్యను ఆదేశించారు. దీంతో కమిషనర్ నిశ్చార్థ వేడుకను స్వయంగా పర్యవేక్షించారు.

ప్రత్యూష జీవితంలో ఇక ఆనందమే..
కాగా, ప్రస్తుతం నర్సింగ్ కోర్సు పూర్తి చేసిన ప్రత్యూష.. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పనిచేస్తోంది. తన వివాహ వేడుకకు ఖచ్చితంగా వస్తానని కేసీఆర్ చెప్పారని ప్రత్యూష సంతోషం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ అండతోనే తాను కోలుకున్నానని, మంచి కుటుంబంలోకి వెళుతున్నందుకు ఆనందంగా ఉందని ప్రత్యూష ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. చిన్ననాటి నుంచి అనేక బాధలు, కష్టాలు పడిన ప్రత్యూష.. ఇక తన జీవితాన్ని సుఖసంతోషాలతో గడపాలని కోరుకుందాం.












Click it and Unblock the Notifications