రాజమౌళిగారు.. కొంచెం పట్టించుకోండి సార్!
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో వారసుల హవా కొనసాగుతోంది. హీరోల కొడుకులే కాకుండా నిర్మాత, దర్శకుడు, సంగీ దర్శకుడు, ఇతర టెక్నీషియన్ల పిల్లలంతా హీరోలైపోతున్నారు. ఈకోవలోనే కీరవాణి.. తన చిన్న కొడుకు కోడూరి సింహాను హీరోను చేశారు. పెద్ద కొడుకు కాలభైరవ సంగీత దర్శకుడిగా మారారు. కాలభైరవ, సింహా.. ఇద్దరూ కలిసి మత్తు వదలరా అనే సినిమా చేశారు.
అటువంటి సినిమాతో పరిచయమైనందుకు అందరూ వారిద్దరినీ అభినందించారు. ఇద్దరికీ మంచి భవిష్యత్తు ఉందనే అభిప్రాయాలు కూడా వెలువడ్డాయి. కాలభైరవకు కలర్ ఫొటో, కార్తికేయ2 చిత్రాలు మంచి పేరు తెచ్చిపెట్టాయి. సింహా మాత్రం తెల్లవారితే గురువారం చేస్తే అది ఫెయిలైంది. తర్వాత చేసిన దొంగలున్నారు జాగ్రత్త సినిమా ఎప్పుడు వచ్చిందో? ఎప్పుడు పోయిందో? ఎవరికీ తెలియదు. తాజాగా భాగ్ సాలే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

ఈ సినిమా ట్రైలర్ విడుదలైనప్పుడు మంచి ఎంటర్ టైనర్ అని అందరూ భావించారు. సినిమా చూసినవారు మాత్రం పెదవి విరిచారు. ఇంత నాణ్యత లేని సినిమాను ఎలా ఒప్పుకున్నాడా? అని అందరికీ ఆశ్చర్యం వేసింది. అతనేమీ అనామకుడు కాదు. రాజమౌళి లాంటి దర్శక ధీరుడి కుటుంబానికి చెందిన వ్యక్తే ఇలాంటి సినిమా ఎలా చేశాడా? అనుకుంటున్నారు అందరూ.
సొంతంగా ఎదగాలన్న ఉద్దేశంతో సినిమాలను ఎంపిక చేసుకునే అవకాశం అతడికి వదిలేస్తున్నారనుకుంటా. అయితే ఈ తరహా పేలవమైన సినిమాలవల్ల కెరీర్ దెబ్బతింటుంది. సినిమాల ఎంపికలో రాజమౌళి, కీరవాణి సలహాలు, సూచనలు తీసుకోవాలని సినీ పెద్దలు సూచిస్తున్నారు.
కథ విన్నప్పుడు బానే ఉంటుందని, తీరా షూటింగ్ జరుపుకొని రష్ చూసిన తర్వాత బాగోని సందర్భాలనేకం ఉన్నాయని, రష్ చూసి కరెక్షన్లు చేయాల్సిన అవసరం కూడా ఉందంటున్నారు. రాజమౌళి సింహా కెరీర్ పై దృష్టి పెట్టాలనే సూచనలు కూడా వస్తున్నాయి. మరి రాజమౌళి ఏం చేస్తారో?.












Click it and Unblock the Notifications