హమ్మయ్యా.. చిన్నారి క్షేమం, ఊపిరి పీల్చుకున్న పేరంట్స్
హైదరాబాద్ లో చిన్నారి కిడ్నాప్ కలకలం రేపింది. చివరికి సుఖాంతమైంది. సికింద్రాబాద్ పరిధిలో గల గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలో 3 ఏళ్ల చిన్నారి కీర్తనను.. దుండగులు ఇవాళ మధ్యాహ్నం కిడ్నాప్ చేశారు. యాక్టివా టూ వీలర్ పై బ్లూ కలర్ షర్ట్ వేసుకున్న ఓ వ్యక్తి చిన్నారిని తీసుకెళ్లినట్టు స్థానికులు ఇచ్చిన సమాచారంతో.. పోలీసులు విస్తృతంగా గాలించారు.
తమకు ఎవరితో గొడవలు లేవని పేరంట్స్ కన్నీళ్లు పెట్టుకున్నారు. మధ్యాహ్నం 1.40 గంటల సమయంలో పాప ఇంటిముందు ఆడుకుంటుండగా.. అన్నం తీసుకువద్దామని లోపలికి వెళ్లినట్టు చెప్పారు. బయటికి వచ్చి చూసేసరికి పాప కనిపించలేదని.. అంతా వెతికి పోలీసులను ఆశ్రయించామన్నారు. మరోవైపు.. పాపను దుండగుడు కిడ్నాప్ చేసి తీసుకెళ్తుండగా తాను చూసినట్టు మరో వ్యక్తి మీడియాకు చెప్పాడు. పాపను ఓ వ్యక్తి ఎత్తుకుని వెళ్లిపోయాడని.. కాసేపటికి యాక్టివాపై కూర్చోబెట్టుకుని తీసుకెళ్లిపోయాడని అన్నాడు. తమ కాలనీలో సమస్యలను ఎవరూ పట్టించుకోవడం లేదని.. సీసీ కెమెరాలు కూడా పనిచేయడం లేదని చెప్పాడు.
ఈ సమాచారంతో.. కిడ్నాప్ వ్యవహారాన్ని చాలెంజ్ గా తీసుకున్న పోలీసులు.. నగరంలో అన్నివైపులా గాలించారు. చివరికి జీడిమెట్లలో ఉన్నట్టు గుర్తించారు. చిన్నారిని జాగ్రత్తగా తమ అదుపులోకి తీసుకుని.. అక్కడి నుంచి రామ్ గోపాల్ పేట పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చారు. అక్కడే తల్లిదండ్రులకు కీర్తనను క్షేమంగా అప్పగించారు. మధ్యాహ్నం కనిపించకుండా పోయిన కీర్తన.. చివరికి క్షేమంగా ఇంటికి చేరడంతో.. ఆమె తల్లిదండ్రులు, కుటుంబీకులు, కాలనీవాసులు ఆనందించారు.