లేఖాస్త్రం: సీఎం కేసీఆర్కు కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేఖ..
ముఖ్యమంత్రి కేసీఆర్కు కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేఖ రాశారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 203 అమలు కాకుండా చూడాలని కోరారు. పోతిరెడ్డి పాడు ద్వారా శ్రీశైలం రిజర్వాయర్ నుంచి 6 నుంచి 8 టీఎంసీల నీటిని తరలించేందుకు ఏపీ సర్కార్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
నీటిని తరలిప్తు దక్షిణ తెలంగాణ ఏడారి అవుతోందని వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. పాలమూరు రంగారెడ్డి, డిండి, శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ , ఉదయ సముద్రం ప్రాజెక్టులకు నీటి కరువు ఏర్పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. పోతిరెడ్డి పాడు ప్రాజెక్టు అమలైతే నాగార్జున సాగర్కు చుక్క నీరు రాదు అని.. ఆయకట్టు రైతులు సాగు, తాగు నీటికి ఇబ్బందులు పడతారని తెలిపారు. అంతేకాదు జంటనగరాలు దాహర్తితో అల్లాడే ప్రమాదం పొంచి ఉందన్నారు. పోతిరెడ్డి పాడు పనులను తక్షణమే నిలిపి వేసేలా చర్యలు తీసుకోవాలని లేఖలో తెలిపారు.
కృష్ణ బేసిన్ లోని తెలంగాణ ప్రాజెక్టుల పనులు పూర్తయ్యేలా నిధులు కేటాయించాలని కోమటిరెడ్డి కోరారు. లేదంటే ప్రజల్లో సెంటిమెంట్ పెరిగే అవకాశం ఉందన్నారు. పోతిరెడ్డి పాడు విస్తరణ పనులు జరిగితే కేసీఆర్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ఛలో పోతిరెడ్డి పాడు కార్యక్రమం నిర్వహించి ప్రభుత్వ విధానాన్ని ఎండగడుతామన్నారు.