ఎమ్మార్వో ఆఫీసులో జూనియర్ ఎన్టీఆర్: ఆరున్నర ఎకరాల ల్యాండ్ రిజిస్ట్రేషన్, ఫొటోలు, సెల్ఫీలు..
హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు జూనియర్ ఎన్టీఆర్ రంగారెడ్డి జిల్లా శంకర్పల్లిలోని తాహసీల్దార్ కార్యాలయానికి వచ్చారు. గోపాలపురం గ్రామంలో రెవెన్యూ పరిధిలోని 6.30 ఎకరాల భూమిని కొనుగోలుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ పనుల కోసం ఎన్టీఆర్ శుక్రవారం స్వయంగా ఎమ్మార్వో కార్యాలయానికి వెళ్ళినట్లు సమాచారం. దీంతో కార్యాలయంలో సందడి నెలకొంది.
రిజిస్ట్రేషన్ పని పూర్తయిన తర్వాత ఎన్టీఆర్తో ఫొటోలు, సెల్ఫీలు దిగేందుకు తాహసీల్దార్ సహా సిబ్బంది, అధికారులు పోటీపడ్డారు. రిజిస్ట్రేషన్ అధికారి తాహసీల్దార్ కృష్ణకుమార్, ఇతర అధికారులు, సిబ్బంది ఫొటోలు దిగారు. సెల్ఫీలు తీసుకున్నారు. ఆ తర్వాత సోషల్ మీడియాలో పంచుకున్నారు.
కాగా, జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్తేజ్ కూడా నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్.. కొమురంభీమ్ పాత్రలో కనిపించబోతున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటులు అజయ్ దేవగణ్, అలియా భట్ కూడా నటిస్తున్నారు. భారీ తారగణంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి. తెలుగు, హిందీతోపాటు పలు భాషాల్లో ఈ చిత్రం విడుదల కానుంది.
Recommended Video
ఇక రామ్చరణ్ తేజ్ అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తున్నారు. కాగా, ఆర్ఆర్ఆర్ సినిమా అక్టోబర్ 13న ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఈ మూవీ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు ఎన్టీఆర్. ఆ తర్వాత కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఓ మూవీ చేయనున్నారు. ఓ వైపు సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ.. ప్రముఖ బుల్లితెర షో 'ఎవరు మీలో కోటీశ్వరుడు'లో కూడా ఎన్టీఆర్ సందడి చేయనున్నారు.