ఎంపీ ఎన్నికల కౌంటింగ్కు ఏర్పాట్లు.. లెక్కింపు కేంద్రాల దగ్గర 144 సెక్షన్
హైదరాబాద్ : చివరి విడత లోక్సభ ఎన్నికలు ఆదివారం నాటితో ముగియనున్నాయి. 23వ తేదీన దేశవ్యాప్తంగా పార్లమెంటరీ స్థానాల ఫలితాలు వెలువడనున్నాయి. అయితే తెలంగాణలో ఓట్ల లెక్కింపు కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్కుమార్. 17 పార్లమెంటరీ సెగ్మెంట్లకు గాను 35 కౌంటింగ్ కేంద్రాల్లో కౌంటింగ్ జరగనుంది. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు.
ఆలయాల్లో ఇంటి దొంగలు.. మొన్న బాసర.. నేడు కొమురెల్లి మల్లన్న బంగారం మాయం
పకడ్బందీ చర్యలు
దాదాపు 3 వేల టేబుళ్ల మీద ఓట్ల కౌంటింగ్ నిర్వహించనున్నారు. అత్యధికంగా అభ్యర్థులు బరిలో నిలిచిన నిజామాబాద్ కౌంటింగ్ కేంద్రంలో ఒక్కో టేబుల్కు ఆరుగురు చొప్పున విధులు నిర్వహించనున్నారు. మల్కాజిగిరి పరిధిలో కూడా అదనపు టేబుళ్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు రజత్ కుమార్. ఎక్కడా కూడా ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
20 వేల మంది సిబ్బందితో విధులు
కౌంటింగ్లో దాదాపు 20వేల సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. ఆ మేరకు వారందరికీ ఇప్పటికే శిక్షణ ఇచ్చినట్లు రజత్ కుమార్ తెలిపారు. ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరిగినట్లుగానే కౌంటింగ్ కూడా అలాగే నిర్వహిస్తామన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో లాటరీ ద్వారా ఐదు వీవీ ప్యాట్ యంత్రాలను ఎంపిక చేసి స్లిప్పులు లెక్కిస్తామన్నారు.
పూర్తి ఫలితాలు వెలువడటానికి సాధారణంగా కంటే రెండు గంటలు అదనపు సమయం తీసుకోవచ్చని అభిప్రాయపడ్డారు. మొత్తానికి సాయంత్రం లోపే ఫలితాలు వెల్లడించే ఛాన్స్ ఉందన్నారు.
ఓట్ల లెక్కింపు కేంద్రాల దగ్గర 144 సెక్షన్
ఈవీఎం, వీవీప్యాట్లు చూసినప్పుడు ఏమైనా తేడా కనిపిస్తే.. వీవీప్యాట్ స్లిప్పులనే పరిగణలోకి తీసుకుంటామన్నారు రజత్ కుమార్. ఇక కౌంటింగ్ కేంద్రాల దగ్గర ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఒకవేళ ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
17 స్థానాలకు సంబంధించి పూర్తి స్థాయి ఫలితాలు వెలువడే వరకు ఓట్ల లెక్కింపు కేంద్రాల దగ్గర 144 సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు. అలాగే లెక్కింపు కేంద్రాల పరిసర ప్రాంతాల్లో విజయోత్సవ ర్యాలీలు నిర్వహించడానికి వీలులేదన్నారు. అలాంటి వాటికి అనుమతి లేదని స్పష్టం చేశారు. వేసవి కాలం దృష్టిలో పెట్టుకుని కౌంటింగ్ కేంద్రాల దగ్గర తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, అలాగే వైద్య సేవలు అందుబాటులో ఉంచుతామన్నారు.