ప్రగతి భవన్ ఎదుట కలకలం... కేబినెట్ మీటింగ్ జరుగుతున్న సమయంలో.. వ్యక్తి ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్లోని సీఎం క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్ ఎదుట బుధవారం(జులై 14) తీవ్ర కలకలం రేగింది. ఓ వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేశాడు. వెంటనే అక్కడున్న పోలీసులు అప్రమత్తమై ఆత్మహత్యయత్నాన్ని అడ్డుకున్నారు. అక్కడి నుంచి అతన్ని పంజాగుట్ట పోలీస్ స్టేషన్కు తరలించారు. ప్రగతి భవన్లో కేబినెట్ సమావేశం జరుగుతుండగానే ఈ ఘటన చోటు చేసుకోవడంతో తీవ్ర కలకలం రేగింది.
ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తిని మెదక్ జిల్లా, చిన్నశంకరం పేటకు చెందిన మొయినుద్దీన్(38)గా పోలీసులు గుర్తించారు. స్వగ్రామంలో తనకు చెందిన వ్యవసాయ భూమిని బంధువులు కబ్జా చేశారని మొయినుద్దీన్ పోలీసులతో వెల్లడించారు. అధికారుల చుట్టూ తిరుగుతున్నా సమస్య పరిష్కారం కాకపోవడంతో ప్రగతి భవన్ ఎదుట ఆత్మహత్యకు యత్నించినట్లు వెల్లడించాడు. ఇప్పటికైనా తనకు న్యాయం జరిగేలా చూడాలని పోలీసులను కోరాడు.
ప్రగతి భవన్ ఎదుట కలకలం-అన్నాదమ్ముల ఆత్మహత్యాయత్నం-కాసేపట్లో కేబినెట్ సమావేశమనగా
ప్రగతి భవన్లో కేబినెట్ సమావేశం జరిగిన ప్రతీసారి ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. కొద్దిరోజుల క్రితం నిజామాబాద్కు చెందిన ఓ యువతి... ఉద్యోగాల కల్పనలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఆరోపిస్తూ ప్రగతి భవన్ ఎదుట తీవ్ర నిరసన వ్యక్తం చేసింది.పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని అక్కడినుంచి తరలించారు.
గత నెలలో ఇద్దరు అన్నాదమ్ములు ప్రగతి భవన్ ఎదుట ఆత్మహత్యయత్నానికి పాల్పడిన సంగతి తెలిసిందే.ఇద్దరిలో ఒకరు మంత్రి హరీశ్ రావు కాన్వాయ్ కిందపడి ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించగా.. మరొకరు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించారు. వెంటనే అక్కడ ఉన్న పోలీసులు అప్రమత్తమై వారిని అడ్డుకున్నారు. కేబినెట్ సమావేశానికి కొద్ది నిమిషాల ముందు ఈ ఘటన చోటు చేసుకుంది.
హైదరాబాద్ కొంపల్లిలోని తమ ఇంటి స్థలాన్ని ఓ రౌడీ షీటర్ కబ్జా చేశాడని... స్థానిక పోలీస్ అధికారి అతనికి సహకరిస్తున్నాడని ఆరోపిస్తూ ఆ అన్నాదమ్ములు ఆత్మహత్యకు యత్నించారు. రౌడీ షీటర్తో కుమ్మక్కై పోలీస్ అధికారి తమ నుంచి డబ్బులు డిమాండ్ చేస్తున్నాడని ఆరోపించారు. దీనిపై డీజీపీ మహేందర్ రెడ్డి,సైబరాబాద్ సీపీ సజ్జనార్లకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని... అందుకే ఆత్మహత్యకు యత్నించామని తెలిపారు. దయచేసి తమకు న్యాయం చేయాలని పోలీసులను వేడుకున్నారు.