మహా మాయగాడు.. ఆ బిల్డప్ చూసి ఎంతో మంది బోల్తా పడ్డారు.. సీఎం ఓఎస్డీ పీఏ పేరుతో మోసాలు...
అతని పేరు సుధాకర్... మోసాలు చేయడంలో మహా ముదురు... అతని బిల్డప్ చూసి ఎవరైనా సరే హైప్రొఫైల్ వ్యక్తి అనుకుంటారు... అతనిచ్చే ఆతిథ్యం,చెప్పే మాటలు ఆ రేంజ్లో ఉంటాయి మరి... చిన్నా,చితకా మోసాలు చేయడు.. కొడితే కుంభస్థలమే అన్నట్లు అన్ని భారీ మోసాలే... పైగా అతని జాబితాలో బాధితులుగా మిగిలిపోయింది ప్రొఫెసర్లు,రాజకీయ నేతలే కావడం గమనార్హం... ముఖ్యమంత్రి ఓఎస్డీ పీఏగా చెప్పుకుంటూ కొన్నాళ్లుగా భారీ మోసాలకు పాల్పడుతున్న సుధాకర్ బాగోతం ఎట్టకేలకు బట్టబయలైంది.

ఎవరీ సుధాకర్...
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఓఎస్డీ పీఏగా సుధాకర్ తనను తాను చాలామందికి పరిచయం చేసుకున్నాడు. రెండేళ్ల నుంచి హైదరాబాద్,నగర శివారుల్లోని ప్రముఖ ఆలయాలు,ఆశ్రమాలకు తరచూ వెళ్తుండేవాడు. అక్కడికి వచ్చే బడా ఫ్యామిలీలను సుధాకర్ టార్గెట్ చేసేవాడు. తన పలుకుబడి,హోదా,సంపాదన గురించి ఓ రేంజ్లో బిల్డప్ ఇచ్చేవాడు. విలాసవంతమైన హోటళ్లకు పిలిపించి ఖరీదైన ఆతిథ్యం ఇచ్చేవాడు. వారిని బుట్టలో పడేసేందుకు ఖరీదైన బహుమతులు కూడా ఇచ్చేవాడు. ఇవన్నీ చూసి సుధాకర్ నిజంగానే హైప్రొఫైల్ వ్యక్తి అని చాలామందే నమ్మేసేవారు. అలా ఇద్దరు స్వామిజీలను సుధాకర్ బురిడీ కొట్టించాడు. వారి నుంచి రూ.60లక్షలు వరకు కాజేశాడు.

ఆ ఆశ్రమంలో.. ఇదీ అతని బిల్డప్...
ఏడాది కాలంగా కూకట్పల్లి-మియాపూర్ మార్గంలోని ఓ ఆశ్రమానికి సుధాకర్ తరుచూ వెళ్తున్నాడు. ఫార్చునర్ కారు,ప్రైవేట్ బాడీ గార్డ్స్,చుట్టూ అనుచరులు... ఇవన్నీ చూసి అక్కడి స్వామిజీలు అతన్ని హైప్రొఫైల్ వ్యక్తిగా భావించేవారు. అతనికి మర్యాదలు బాగానే చేసేవారు. కొన్నాళ్లకు ఆ ఆశ్రమంలోని స్వామిజీలు సహా 50 మంది భక్తులకు మహంకాళి అమ్మవారి పంచలోహ ప్రతిమలను బహుమతులుగా ఇచ్చాడు. దీంతో ఆ ఆశ్రమానికి వచ్చేవారికి అతనిపై మరింత గౌరవం ఏర్పడింది. ఈ క్రమంలో ఓ బ్యాంకు మేనేజర్ భార్యతో అతనికి పరిచయం ఏర్పడింది. ఆమెను అమ్మా అని సంబోధిస్తూ నమ్మకస్తుడిగా మెలిగాడు.

ఆమె నుంచి రూ.1.23కోట్లు వసూలు...
ఇదే క్రమంలో... తాను పేద వర్గాలకు తక్కువ ధరలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించి ఇస్తున్నట్లు ఆమెతో చెప్పాడు. నిజమేనని నమ్మిన ఆమె... తనకు తెలిసినవాళ్లు ఉన్నారని... వారికి కూడా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని కోరింది. అందుకు రూ.5లక్షలు ఖర్చు అవుతాయని చెప్పాడు. అదే సమయంలో ఆమెకు,ఆమె స్నేహితులకు వీఐపీల ఇళ్లు ఇప్పిస్తానని చెప్పాడు. దీంతో ఆమె తన స్నేహితులు,తెలిసినవాళ్ల వద్ద నుంచి రూ1.23కోట్లు వసూలు చేసి అతనికి ఇచ్చింది. సంక్రాంతి లోపు ఇళ్లు ఇస్తానని చెప్పిన సుధాకర్ మళ్లీ అటువైపు కన్నెత్తి చూడలేదు. దీంతో మోసపోయామని వారికి అర్థమైంది.

ప్రొఫెసర్ నుంచి రూ.33లక్షలు...
తార్నాకలోని ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ ఒకరిని కూడా సుధాకర్ బురిడీ కొట్టించాడు. ఉస్మానియా వర్సిటీ పరిధిలోని 600 చదరపు గజాల ప్రభుత్వ భూమిని మీ పేరిట రిజిస్ట్రేషన్ చేయిస్తానని ప్రొఫెసర్ను నమ్మించాడు. ఆ స్థలాన్ని అమ్మే హక్కు ప్రభుత్వానికి ఉందని... అది తాను చూసుకుంటానని చెప్పాడు. అలా ఆ ప్రొఫెసర్ నుంచి రూ.33లక్షలు వసూలు చేసి నోటరీపై సంతకాలు చేయించి స్థలం రాసిచ్చాడు. దీంతో ఆ స్థలం తన సొంతమైందని భావించిన ప్రొఫెసర్ దాన్ని స్వాధీనం చేసుకునేందుకు వెళ్లాడు. విషయం తెలిసి పోలీసులు అడ్డుపడటంతో మోసపోయానని గ్రహించాడు. ముఖ్యమంత్రి ఓస్డీ పీఏ అని చెప్పడంతో డబ్బులు సమర్పించినట్లు వాపోయాడు. సికింద్రాబాద్ పరిధిలోని ఓ రాజకీయ నేతను కూడా సుధాకర్ మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. అతన్ని,అతని అనుచరులను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.












Click it and Unblock the Notifications