రాజాసింగ్ పై బహిష్కరణ వేటు పడేనా..!! ఎంఐఎం ఫిర్యాదు...!!
వివాదాస్పద వ్యాఖ్యలు..వీడియోతో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చిక్కుల్లో పడ్డారు. ఇప్పటికే బీజేపీ ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఎందుకు బహిష్కరించుకూడదో చెప్పాలంటూ నోటీసులు జారీ చేసింది. శాసనసభా పక్ష నేత పదవి నుంచి తప్పించింది. రాజకీయంగా రాజాసింగ్ పైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిరసనలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలు పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు నమోదయ్యాయి. పోలీసలు అరెస్ట్ చేసినా.. సరైన పద్దతులు పాటించలేదంటూ కోర్టు రిమాండ్ తిరస్కరించింది.
స్పీకర్ కు ఎంఐఎం ఫిర్యాదు
ఇక, ఇదే సమయంలో ఎంఐఎం స్పీకర్ కు ఫిర్యాదు చేసింది. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ను అసెంబ్లీ నుంచి బహిష్కరించాలని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని కోరింది. ఈ మేరకు స్పీకర్ శ్రీనివాస్ రెడ్డికి ఎంఐఎం పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే అహ్మద్ పాషా ఖాద్రీ లేఖ రాశారు. అందులో ఎమ్మెల్యేగా ప్రమాణాన్ని ఉల్లంఘించారని ఆరోపించారు. వెంటనే దీనికి సంబంధించి ప్రొసీడింగ్స్ ప్రారంభించాలని కోరారు. దీని పైన స్పీకర్ నిర్ణయం పైన ఉత్కంఠ నెలకొని ఉంది.
స్పీకర్ నిర్ణయం పై ఉత్కంఠ
ఈ వ్యవహారాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. శాంతి భద్రతలకు ఎవరు విఘాతం కలిగించినా కఠినంగా వ్యవహరిస్తామని చెబుతోంది. బీజేపీ అధినాయకత్వం సస్పెండ్ చేస్తూనే..బహిష్కరణ పైన సంజాయిషీ ఇచ్చిన తరువాత నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. భవిష్యత్ లో ఇటువంటి చర్యలకు ఎవరూ పాల్పడకుండా.. విద్వేషాలు రెచ్చగొట్టేలా ఎవరూ ప్రయత్నించకుండా..గట్టి సందేశం ఇవ్వాలని భావిస్తున్నట్లుగా సమాచారం. అందుకు ఇప్పుడు స్పీకర్ ఎంఐఎం ఇచ్చిన ఫిర్యాదు పైన న్యాయ సలహాలు తీసుకొనే అవకాశం ఉంది. రాష్ట్ర విభజన తరువాత తెలంగాణ అసెంబ్లీలో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బహిష్కరించారు.
బహిష్కరణ వేటు పడనుందా
మధుసూధనాచారి అసెంబ్లీ స్పీకర్ గా ఉన్న సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి,సంపత్ కుమార్ పై బహిష్కరణ వేటు వేసారు. గవర్నర్ ప్రసంగంలో అనుచితంగా ప్రవర్తించారనే కారణంగా ఆ ఇద్దరు ఎమ్మెల్యేల పైన నాటి స్పీకర్ చర్యలు తీసుకున్నారు. స్పీకర్ కు ఉన్న విచక్షణాధికారాలతో న్యాయ సలహా మేరకు నిర్ణయం తీసుకుంటారా..లేక, తదుపరి అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించి..మూడ్ ఆఫ్ ది హౌస్ గా నిర్ణయం ప్రకటిస్తారా అనేది స్పష్టత రావాల్సి ఉంది. దీంతో..ఇప్పుడు బీజేపీ హైకమాండ్ కు రాజాసింగ్ ఏ రకమైన సమాధానం ఇస్తారు.. స్పీకర్ నిర్ణయం ఎలా ఉంటుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.