కరోనా కేసులు పెరుగుదల: మంత్రి హరీశ్ రావు సమీక్ష, కీలక సూచనలు
కరోనా విషయంలో ఆందోళన చెందవద్దని, అప్రమత్తంగా ఉంటూ వైద్య సేవలందించాలని వైద్యాధికారులను ఆదేశించారు వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు.
హైదరాబాద్: కరోనా వైరస్ కేసులు నెమ్మదిగా పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా విషయంలో ఆందోళన చెందవద్దని, అప్రమత్తంగా ఉంటూ వైద్య సేవలందించాలని వైద్యాధికారులను ఆదేశించారు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు. శుక్రవారం సంబంధిత అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన పలు సూచనలు చేశారు.
ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కరోనా కేసుల పెరుగుతలపై రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం కూడా కరోనావైరస్(Coronavirus) కట్టడికి చర్యలు ప్రారంభించింది. కరోనా వ్యాక్సిన్ తీసుకోవడంలో నిర్లక్ష్యం వద్దని మంత్రి హరీశ్ రావు(Harish Rao) సూచించారు.

అర్హులైన ప్రతి ఒక్కరూ వ్యాకసిన్, ప్రికాషన్ డోసు తీసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అన్ని ప్రాథమిక వైద్యారోగ్య కేంద్రాలు, యూపీహెచ్సీలలో వ్యాక్సిన్ అందుబాటులో ఉండేలా చూడాలని మంత్రి హరీశ్ రావు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రానికి మరిన్ని డోసులు సరఫరా చేయాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాయాలని ఈ సందర్భంగా నిర్ణయించారు.
ప్రతీ ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని.. మాస్కులు ధరించి, జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా మంత్రి సూచించారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు మరోసారి పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆరు రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. వైరస్ నివారణకు అన్ని రకాల చర్యలు చేపట్టాలని లేఖలు రాసింది. ఆరు రాష్ట్రాలకు లేఖలో రాసిన వాటిలో కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ, గుజరాత్, కర్ణాటక ఉన్నాయి.












Click it and Unblock the Notifications