ఆపత్కాలంలో ఆదుకోవాలే తప్ప.. అసత్య ఆరోపణలు వద్దు: మంత్రి తలసాని
విపక్షాలపై మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ మండిపడ్డారు. సంచలనాల కోసం ఏవేవో మాట్లాడుతున్నారని ఆరోపించారు. తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడు బండి సంజయ్.. బాధ్యత కలిగి మసలుకోవాలని, ఎంపీగా మంచి ప్రవర్తనతో నడుచుకోవాలని సూచించారు. కానీ ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేయడం మంచి పద్ధతి కాదన్నారు. నాలుకకు నరం ఉండదని, నోటికొచ్చినట్టు మాట్లాడతామంటే కుదరదని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని చెప్పారు. ఆ పార్టీని ఏ రాష్ట్ర ప్రజలు పట్టించుకోవడం లేదన్నారు. అఖిలపక్షం అంటే అలీ బాబా బ్యాచ్ అని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికలకు ముందు అఖిలపక్ష మాట వినిపించి.. మళ్లీ ఇన్నాళ్లకు తెరమీదకొచ్చారని గుర్తుచేశారు. వాళ్లకు జనం, వారి సమస్యలపై చిత్తశుద్ధి లేదు అని చెప్పారు.
శుక్రవారం నుంచి రెండో విడత రేషన్ పంపిణీ ప్రారంభించామని తెలిపారు. చేపలు, కోళ్లు, కోడిగుడ్డు ఇబ్బంది లేకుండా సరఫరా చేస్తున్నామని చెప్పారు. కిలో మటన్ రూ.700కి మించి విక్రయించొద్దని ఆదేశాలు జారీచేశామని పేర్కొన్నారు. వలస కార్మికుల తరలింపునకు కోసం ప్రత్యేక రైళ్లు పెట్టాలని.. శుక్రవారం ఉదయం ఒకరైలు జార్ఖండ్ వెళ్లిందని చెప్పారు. ఏపీ ప్రభుత్వం తరలించిన వలస కార్మికులకు కూడా భోజనం పెట్టి పంపించామని తెలిపారు.