Kanti Velugu: అంధత్వం లేని రాష్ట్రమే లక్ష్యం: తలసాని శ్రీనివాస్ యాదవ్
రాష్ట్రవ్యాప్తంగా కంటి వెలుగు రెండో విడత కార్యక్రమం కొనసాగుతోంది. ఈ కంటి వెలుగు రెండో విడత కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ ఖమ్మంలో ప్రారంభించారు. దీంతో అన్ని జిల్లాలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. శుక్రవారం సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధి గన్ బజార్ లో కంటి వెలుగు కేంద్రాన్ని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు.
కంటి సమస్యతో బాధపడుతున్న వారికి కంటి వెలుగు ఒక వరం లాంటిదని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రం చేపట్టని విధంగా తెలంగాణ ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమాన్ని మొదలు పెట్టిందన్నారు. గతంలో మొదటి విడత నిర్వహించామని.. ప్రస్తుతం రెండో విడత కొనసాగుతోందని తెలిపారు. వంద రోజుల పాటు నిర్వహించే కంటి వెలుగును గ్రామాలు, బస్తీలు, కాలనీలోని ప్రజలు ఉపయోగించుకోవాలని కోరారు.
కంటి సమస్యలున్న వారికి ఉచితంగానే పరీక్షలు చేసి మందులు, కళ్ళద్దాల ఇస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరికి కంటిచూపు ప్రధానమైనదని తలసాని పేర్కొన్నారు. కళ్ల ఆపరేషన్ అవసరమున్న వారికి ఉచితంగా ఆపరేషన్లు కూడా చేయిస్తామని పేర్కొన్నారు. అంధత్వం లేని రాష్ట్రాంగా తీర్చిదిద్దడానికి కిందిస్థాయి వరకు కంటి వెలుగును తీసుకెళ్తున్నామని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు.
ప్రజల్లో దృష్టిలోపాలను సవరించేందుకే కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందని దీని వెనక ఎలాంటి రాజకీయం లేదని మంత్రి ప్రశాంత్రెడ్డి అన్నారు. కంటి వెలుగు కార్యక్రమంలో కళ్లను కంప్యూటర్ ద్వారా పరీక్షించి.. సాధారణ కంటి సమస్యలు ఉన్న వారికి 2 గంటల్లో రీడింగ్ గ్లాసులతో కళ్లద్దాలు ఇస్తారు. అదే దూరదృష్టి ఇతర కంటి సమస్యలు ఉంటే బార్కోడ్ విధానం ద్వారా... పది రోజుల్లో కళ్లద్దాలను ఆశా, ఆరోగ్య కార్యకర్తలు ఇళ్లకు తెచ్చి ఇవ్వనున్నారు.