నిమ్స్లో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న ఎమ్మెల్సీ కవిత... మంత్రి నిరంజన్ రెడ్డి,ఎంపీ సంతోష్ కూడా...
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. సోమవారం(మార్చి 29) ఉదయం హైదరాబాద్లోని నిమ్స్ ఆస్పత్రిలో కవిత కరోనా టీకా మొదటి డోసు వేయించుకున్నారు. వ్యాక్సినేషన్ అనంతరం కవిత మాట్లాడుతూ... వ్యాక్సిన్ తీసుకోవడంలో ఎలాంటి అపోహలు,అనుమానాలు వద్దన్నారు. అర్హులైన ప్రతీ ఒక్కరు టీకా తీసుకోవాలని కోరారు. ఇటీవల కవిత భర్త అనిల్కు కరోనా సోకడంతో కొద్దిరోజులు ఆమె కుటుంబమంతా హోం క్వారెంటైన్లో ఉన్న విషయం తెలిసిందే.
వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి,రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ నిమ్స్ ఆస్పత్రిలో కూడా కరోనా టీకా వేయించుకున్నారు. సతీమణి రోహిణితో కలిసి సంతోష్ కుమార్ టీకా తీసుకున్నారు. ఈ సందర్భంగా సంతోష్ కుమార్ మాట్లాడుతూ... కరోనా మహమ్మారి బారిన పడకుండా ఉండాలంటే ప్రతీ ఒక్కరూ కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు.టీకా తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదని, భయపడాల్సిన పనిలేదని చెప్పారు.
మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ... కరోనా విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అవరమైతేనే ఇంటి నుంచి బయటకు వెళ్లాలని... అనవసరమైన పనుల కోసం బయట తిరగవద్దని సూచించారు. ఆరోగ్యశాఖ సూచనలను తప్పనిసరిగా పాటించాలన్నారు.
I have taken first dose of COVID-19 Vaccine today at NIMS Hospital. Let us all take a pledge to get ourselves and our loved ones vaccinated at the earliest. In the wake of rising cases once again, I urge everybody to stay safe and wear a mask. pic.twitter.com/3AMFAFcSh8
— Kavitha Kalvakuntla (@RaoKavitha) March 29, 2021
కాగా,తెలంగాణలో పలువురు ప్రజాప్రతినిధులు కరోనా బారినపడి కోలుకున్న సంగతి తెలిసిందే. కొద్దిరోజుల క్రితం వరకూ రాష్ట్రంలో తక్కువ సంఖ్యలోనే నమోదైన కేసులు గత రెండు,మూడు రోజులుగా ఐదు వందలకు అటు,ఇటుగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 33,930 పరీక్షలు నిర్వహించగా 403 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.ఆదివారం(మార్చి 28) 535 కేసులు నమోదైన సంగతి తెలిసిందే. తాజా కేసులతో ఇప్పటి వరకూ రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3,06,742కి చేరింది. గడిచిన 24గంటల్లో కరోనాతో మరో ఇద్దరు మృతి చెందడంతో..ఇప్పటి వరకూ కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 1690కి చేరింది.
Mlc Kavitha took #COVID19 vaccine today pic.twitter.com/2c1KoJVagL
— Kavithakka News (@KavithakkaNews) March 29, 2021
తాజాగా మరో 313 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. దీంతో ఇప్పటి వరకూ కోలుకున్నవారి సంఖ్య 3,00,469కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 4,583 యాక్టివ్ కేసులు కొనసాగుతున్నాయి. వీరిలో 1,815 మంది హోమ్ ఐసోలేషన్లో ఉన్నారు. టెస్టుల విషయానికి వస్తే ఇప్పటివరకూ రాష్ట్రంలో 1,00,53,026 కొవిడ్ టెస్టులు నిర్వహించారు.