ఎమ్మెల్సీ కవితపై కేసు నమోదుకు హైకోర్టు మెట్లెక్కిన ఎంపీ అరవింద్.. కారణమిదే!!
బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఇంటి పై దాడి చేసిన ఘటన నేపథ్యంలో ఇప్పటికే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే . అయితే తాజాగా ఆయన టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పైన కేసు నమోదు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇక ఈ పిటిషన్ పై తెలంగాణా హైకోర్టు విచారణ జరపనుంది.

ధర్మపురి అరవింద్ ఇంటిపై దాడికి కవిత వ్యాఖ్యలే కారణం
తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ తన ఇంటిపై టిఆర్ఎస్ శ్రేణులు చేసిన దాడి రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఎమ్మెల్సీ కవిత పైన ధర్మపురి అరవింద్ చేసిన వ్యాఖ్యలకు, కవిత తీవ్రంగా స్పందించారు. చెప్పుతో కొడతా అని, అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఎక్కడికి వెళ్ళినా మెత్తగా తంతామని తీవ్ర వ్యాఖ్యలు చేయగా, ఆ తర్వాత ధర్మపురి అరవింద్ ఇంటిపై టిఆర్ఎస్ కార్యకర్తలు, తెలంగాణ జాగృతి సభ్యులు దాడి చేసి విధ్వంసం సృష్టించారు. ఇక కవిత తీవ్రంగా స్పందించటంతోనే ఈ దాడి జరిగినట్టుగా భావిస్తున్నారు.

ధర్మపురి అరవింద్ వ్యాఖ్యలతో కవిత కౌంటర్, ఆపై ఇంటిపై ఎటాక్
ధర్మపురి అరవింద్ కవిత కాంగ్రెస్ పార్టీలో చేరడానికి మల్లికార్జున ఖర్గే తో మాట్లాడారని, ఆ విషయం తనకు కాంగ్రెస్ పార్టీలో ఉన్న అత్యంత ముఖ్యులు చెప్పారని చేసిన వ్యాఖ్యలతో కవిత మండిపడ్డారు. తనపై తప్పుడు ప్రచారం చేసి తన వ్యక్తిత్వం పై వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని తేల్చి చెప్పారు. ఎక్కడ పోటీ చేస్తే అక్కడ ఓడిస్తానని, ఎక్కడికి వెళితే అక్కడ తంతామని మండిపడ్డారు. ఇక ఆ తర్వాత అందులో భాగంగా ధర్మపురి అరవింద్ ఇంటిపై టిఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు.

కవితపై కేసునమోదుకు ఉత్తర్వులు ఇవ్వాలని కోర్టు మెట్లెక్కిన ఎంపీ అరవింద్
మొదట ఇంటి ప్రాంగణంలోకి ప్రవేశించి రాళ్ళు విసిరిన కార్యకర్తలు,ఆపై పూల కుండీలు పగలగొట్టారని,కిటికీలు తలుపులు ధ్వంసం చేశారు. అనంతరం ఇంట్లోకి చొరబడి పూజ గదితోసహా అన్ని గదులలో ఉండేవస్తువులు,ఫర్నిచర్ ధ్వంసం చేశారు. కవిత వ్యాఖ్యల వల్లే తన ఇంటిపై దాడి జరిగిందని కవిత కవిత పైన కేసు నమోదు చేసేలా కోర్టు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ అరవింద్ కోర్టు మెట్లు ఎక్కారు. ఈ మేరకు తాజాగా పిటిషన్ దాఖలు చేశారు

ఈ ఘటనలో తొమ్మిది మందిపై కేసు నమోదు .. కొనసాగుతున్న పోలీసుల విచారణ
కాగా ఈ ఘటనలో కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్న పోలీసులు నిందితులపై అతిక్రమణ,ఆస్తి నష్టం,బెదిరింపు వంటి అభియోగాలు మోపారు.ఘటనా స్థలంలో 2 సిమెంట్ రాళ్లు,2 టిఆర్ఎస్ పార్టీ జెండాలు,రెండు కార్లను స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. మొత్తం తొమ్మిది మందిపై కేసులు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.












Click it and Unblock the Notifications