శిల్ప చౌదరీ బ్యాంక్ లాకర్లు ఓపెన్: డాక్యుమెంట్లు పరిశీలన,
శిల్పా చౌదరి కేసులో విచారణను నార్సింగి పోలీసులు స్పీడప్ చేశారు. ఇప్పటికే రెండుసార్లు కస్టడీలోకి తీసుకున్న పోలీసులు, కోర్టు అనుమతితో ఇవాళ మరోసారి కస్టడీలోకి తీసుకున్నారు. విచారణలో శిల్పాచౌదరి నుంచి కీలక విషయాలు రాబట్టినట్లు తెలుస్తోంది. ఎవరెవరి నుంచి ఎంత మొత్తం వసూలు చేసింది, ఆ మొత్తాన్ని ఎక్కడ పెట్టుబడిగా పెట్టిందో విచారించారు. రాధికారెడ్డి, కొంపల్లి మల్లారెడ్డి, ఎన్ఆర్ఐ ప్రతాప్రెడ్డి పాత్రలపై ఆరా తీశారు. శిల్ప బ్యాంక్ లాకర్లపై ఫోకస్ చేశారు. కోకాపేట్లోని యాక్సిస్ బ్యాంక్లో శిల్పకు లాకర్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. శిల్పను అక్కడికి తీసుకెళ్లారు. ఆమె సమక్షంలో బ్యాంక్ లాకర్లు ఓపెన్ చేసి పరిశీలిస్తున్నారు. లాకర్లో ఉన్న డాక్యుమెంట్స్, వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది.
మూడుసార్లు కస్టడీలోకి..
శిల్పా చౌదరిని ఇప్పటికే మూడుసార్లు కస్టడీకి తీసుకుని పోలీసులు ప్రశ్నించారు. ఇప్పుడు ఆమె భర్త శ్రీనివాస్ ప్రసాద్పై ఫోకస్ చేశారు. శ్రీనివాస్ ప్రసాద్ను విచారించేందుకు పోలీస్ స్టేషన్కు రావాలని ఆదేశించారు. దంపతులు ఇద్దరూ కలిసి ఎలా ఆర్థిక నేరాలు చేశారు. ఎవరెవరితో లావాదేవీలు నడిపారనే కోణంలో శ్రీనివాస్ ప్రసాద్ను ప్రశ్నించే ఛాన్స్ ఉంది. శిల్పా చౌదరి.. ఆమె భర్తపై నార్సింగి పోలీసులకు ముగ్గురు బాధితులు ఫిర్యాదు చేశారు. తమ దగ్గర నుంచి శిల్పా చౌదరి కోట్ల రూపాయలు తీసుకుందని.. డబ్బు తిరిగివ్వాలని అడిగితే బెదిరిస్తోందని కంప్లైంట్ ఇచ్చారు. దీంతో నార్సింగి పోలీసులు శిల్పా చౌదరిని అరెస్ట్ చేసి లోతుగా విచారిస్తే సంచలన విషయాలు బయటపడ్డ సంగతి తెలిసిందే.
కంప్లైంట్ చేయడంతో
శిల్పా చౌదరి తమను మోసం చేసిందంటూ రోహిణిరెడ్డి, దివ్యారెడ్డితోపాటు మహేశ్బాబు సోదరి ప్రియదర్శిని కూడా కంప్లైంట్ చేసింది. శిల్పా చౌదరికి రోహిణిరెడ్డి 3 కోట్ల పది లక్షలు ఇస్తే.. ప్రియదర్శిని 2 కోట్ల 90 లక్షలు ఇచ్చింది. దివ్యారెడ్డి కోటీ 5 లక్షలు ఇచ్చింది. ముగ్గురి నుంచి 7 కోట్ల 5 లక్షలు వసూలు చేసిన శిల్పా చౌదరి.. ఆ తర్వాత హ్యాండిచ్చింది. దీంతో ముగ్గురు బాధితులు నార్సింగి పోలీసులను ఆశ్రయించారు. వీరే కాకుండా చాలామంది హై ప్రొఫైల్ మహిళలు కూడా శిల్పకు డబ్బి ఇచ్చినట్లు సమాచారం ఉంది. అదంతా బ్లాక్మనీ కావడంతో పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేయలేకపోతున్నారని తెలుస్తోంది.
పూసగుచ్చినట్టు వివరించిన ప్రియదర్శిని
శిల్పా చౌదరి మోసాలు ఎలా ఉంటాయో మహేశ్బాబు సోదరి ప్రియదర్శిని పూసగుచ్చినట్లు పోలీసులకు వివరించింది. ప్రియదర్శినిని ట్రాప్లో పడేసిన శిల్ప.. 2 కోట్ల 90 లక్షలు తీసుకుంది. వాటికి ష్యూరిటీగా గోల్డ్ చెయిన్, నకిలీ చెక్కులు ఇచ్చింది. ఆ తర్వాత ప్రియదర్శిని ఫోన్ కాల్స్ ఎత్తకుండా తప్పించుకుంటూ వచ్చింది. అనుమానించిన ప్రియదర్శిని.. తన అనుచరులను డబ్బు వసూలు చేసుకుని రావాలంటూ గండిపేటలోని శిల్పా చౌదరి ఇంటికి పంపించింది. అప్పటికే ఆర్థిక నేరాల్లో ఆరితేరిన శిల్పా చౌదరి.. ప్రియదర్శిని అనుచరులకు చుక్కలు చూపించింది. డబ్బు వసూలు కోసం ఇంటికే వస్తారా అంటూ బెదిరించి వెనక్కి పంపించింది. దీంతో షాకైన ప్రియదర్శిని.. శిల్ప ఇచ్చిన చెక్కులను బ్యాంకులో వేసి డబ్బు రికవరీ చేయాలని ప్రయత్నించింది. బ్యాంకుకు వెళ్లాక ఆమెకు మరో షాక్ తగిలింది. శిల్ప ఇచ్చినవన్నీ నకిలీ చెక్కులని బ్యాంకు అధికారులు తేల్చి చెప్పారు. శిల్ప ఇచ్చిన గోల్డ్ చెయిన్ కూడా నకిలీదేనని తేలడంతో లబోదిబోమంటూ నార్సింగి పోలీసులను ఆశ్రయించింది.
గంట మాట్లాడితే అంతే
రోహిణిరెడ్డి కూడా శిల్ప గురించి షాకింగ్ విషయాల్ని పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. శిల్పా చౌదరితో ఎవరైనా గంటసేపు మాట్లాడితే ట్రాప్లో పడిపోతారని.. తాను కూడా అలాగే మోసపోయానని చెప్పింది. దీంతో హైప్రొఫైల్ మహిళలను శిల్పా చౌదరి ఎలా ట్రాప్ చేసి డబ్బు దండుకుంటుందో పోలీసులకు క్లారిటీ వచ్చింది