ప్రొఫెసర్ కాశిం విడుదల.. 4 నెలల జైలు నిర్బంధం తర్వాత..
ఉస్మానియా ప్రొఫెసర్,నడుస్తున్న తెలంగాణ సంపాదకుడు,విప్లవ రచయితల సంఘం నూతన కార్యదర్శి ప్రొఫెసర్ కాశి బుధవారం(20) సాయంత్రం చర్లపల్లి జైలు నుంచి విడుదలయ్యారు. రంగారెడ్డి కోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడంతో 4 నెలల తర్వాత నిర్బంధం నుంచి ఆయన బయటకొచ్చారు. విడుదల తర్వాత విచారణకు పూర్తిగా సహకరించాలన్న షరతుతో పాటు రూ.1లక్ష పూచీకత్తుపై ఆయన విడుదలకు కోర్టు అనుమతించింది.
విడుదల తర్వాత మీడియాతో మాట్లాడిన కాశిం.. తన కోసం ఆందోళన చెందినవారికీ, తన విడదల కోసం ప్రయత్నించినవారికీ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే గత 4 నెలలుగా తనకు సంబంధించిన వార్తలను ప్రచురిస్తున్న,ప్రసారం చేస్తున్న ప్రింట్&ఎలక్ట్రానిక్ మీడియాకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుత కరోనా సందర్భంలో విద్యా వ్యవస్థపై ప్రభావం పడిందని.. అధ్యాపన,అధ్యయనం,పరిశోధన అనే మూడు అంశాలపై తాను దృష్టి పెట్టబోతున్నానని చెప్పారు. అలాగే బహుజనులకు సంబంధించిన సమస్యలు,అనేక అంశాలపై తన రాతలు కొనసాగుతాయన్నారు.కష్ట కాలంలో తన కుటుంబానికి,తనకూ అన్ని విధాలా అండగా నిలబడి మానసిక ధైర్యాన్ని ఇచ్చిన ప్రతీ ఒక్కరికీ మరోసారి కృతజ్ఞతలు చెబుతున్నానంటూ కాశిం ముగించారు.
కాగా,ఈ ఏడాది జనవరిలో విప్లవ రచయితల సంఘం నూతన కార్యదర్శిగా ఎన్నికైన వారం రోజులకే కాశింను పోలీసులు అరెస్ట్ చేశారు. 2016నాటి కేసులో ఆయన్ను అరెస్ట్ చేయడం.. పరారీలో ఉన్నాడని పోలీసులు ఆరోపించడం విమర్శలకు తావిచ్చింది. అయితే నిత్యం వర్సిటీలో పాఠాలు చెప్పే ప్రొఫెసర్ పరారీలో ఉండటమేంటని కోర్టు సైతం ఆశ్చర్యం వెలిబుచ్చింది. కాశింకు మావోయిస్టులతో సంబంధాలున్నాయని 2016లో లొంగిపోయిన మావోయిస్టు ఎమ్మెస్ సుందర్ రెడ్డి చెబితే 2020లో అరెస్ట్ చేయడమేంటని ప్రశ్నించింది.
మరోవైపు కాశిం అరెస్టును ప్రజా సంఘాలు,కమ్యూనిస్టు పార్టీలు,పౌర హక్కుల సంఘాలు తీవ్రంగా ఖండిస్తూ వచ్చాయి. ఎట్టకేలకు వారి ప్రయత్నాలు ఫలించి కాశిం నేడు జైలు నుంచి విడుదలయ్యారు.