అసదుద్దీన్ పక్కన మోహన్ భగవత్.. మార్పింగ్ చేసి, భగ్గుమన్న ఎంఐఎం, ఫిర్యాదు
ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్, ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్.. ఒకరంటే ఒకరికీ పడదు. ఇద్దరు తమ సిద్దాంతాల మేరకు పనిచేస్తున్నారు. వారిద్దరూ ప్రత్యక్షంగా కలిసిన సందర్భం లేదు. అయితే మార్పింగ్ ముఠా వారిని కలిపింది. ఇంకేముంది ఎంఐఎం శ్రేణులు భగ్గుమంటున్నాయి. ఓవైసీ ఫొటోను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని అజంపురా కార్పొరేటర్ షేక్ మొహియుద్దీన్ అబ్బార్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ పక్కన కూర్చున్న ఫొటోను తీసుకుని.. ములాయం ప్లేస్ లో అసదుద్దీన్ ఓవైసీ కూర్చున్నట్లు ఫొటోను మార్ఫింగ్ చేశారని, దాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. మలక్ పేటకు చెందిన మహ్మద్ అహ్మద్ ఖలీల్ అనే వ్యక్తి ఈ పని చేశాడని అతడిపై చర్యలు తీసుకోవాలని కార్పొరేటర్ అబ్బార్ తన ఫిర్యాదులో కోరాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
వాస్తవానికి ఒరిజినల్ ఫొటోలో మోహన్ భగవత్ పక్కన ములాయం సింగ్ యాదవ్ కూర్చుని ఉన్నారు. 2021 డిసెంబర్ 20న ఈ ఫొటో తీశారు. ఇటీవల ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు మనవరాలు నిహారిక వివాహ రిసెప్షన్ ఢిల్లీలోని వెంకయ్య నాయుడు అధికారిక నివాసంలో జరిగింది. ఇందులో మోహన్ భగవత్, ములాయం సింగ్ యాదవ్ పాల్గొన్నారు. ఈ వేడుకకు పలువురు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.
ఫొటోని మార్ఫింగ్ చేసి ములాయం సింగ్ యాదవ్ స్థానంలో ఓవైసీ ఫొటోని పెట్టారు. సోషల్ మీడియాలో ఈ పిక్ని వైరల్ చేశారు. దీంతో దుమారం రేగింది. ఎంఐఎం నేతలు, ఓవైసీ అనుచరులు దీనిపై మండిపడుతున్నారు. వెంటనే ఆ ఫొటోని తొలగించాలని డిమాండ్ చేశారు. మోహన్ భగవత్ పక్కనే ఓవైసీ కూర్చున్న ఫొటో.. సోషల్ మీడియాలో కలకలం రేపింది. రాజకీయవర్గాల్లోనే కాదు సామాన్య ప్రజల్లోనూ చర్చకు దారితీసింది. మోహన్ భగవత్ పక్కన ఓవైసీ కూర్చోవడం ఏంటి? అనే డిస్కషన్ నడిచింది. చివరికి.. అది ఒరిజినల్ ఫొటో కాదని, మార్పింగ్ చేసిన ఫొటో అని తెలిసింది.