ధాన్యం కొనమని చెప్పలేం, కేసీఆర్ సర్కార్కి కిషన్ రెడ్డి కౌంటర్
యాసంగిలో వరి కొనుగోలు అంశం వివాదం కొనసాగుతూనే ఉంది. టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ మధ్య మాటల మంటలు కంటిన్యూ అవుతున్నాయి. తాజాగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. టీఆర్ఎస్ పార్టీ వల్లే రైతులకు కష్టాలు వస్తున్నాయని చెప్పారు. ధాన్యం కొనదని కేంద్ర ప్రభుత్వం ఎక్కడ చెప్పలేదన్నారు. హుజూరాబాద్ ఎన్నికల ఫలితాలతో టీఆర్ఎస్ బెంబెలేత్తి పోతుందని వివరించారు. ఈ సీజన్లో చివరి బస్తాను కేంద్రం కొంటుందని చెప్పారు. టీఆర్ఎస్ లేని సమస్య సృష్టిస్తుందని చెప్పారు.

సమస్యే కాదు..
ధాన్యం సేకరణ అసలు సమస్యే లేదన్నారు. ఉప్పుడు బియ్యం తీసుకోమని చాలా ఏళ్ళ కిందే కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిందని వివరించారు. రా రైస్ వచ్చేలా రైస్ మిల్లర్ల తో మాట్లాడారా ? రైతులకు ఆ రకమైన విత్తనాలు ఇచ్చారా ? మేం బియ్యం కొనమని ఎక్కడా లేఖ ఇవ్వలేదు. "పుత్ర వాత్సల్యం"తో రైతులను కేసీఆర్ బలి చేస్తున్నారని విమర్శించారు. హుజురాబాద్ ప్రజలు ఇచ్చిన ఫలితంతో తన కొడుకు కేటీఆర్ సీఎం అవ్వలేడని కేసీఆర్ భయపడుతున్నారు.

కోటలు దాటిన మాటలు
తెలంగాణ ను "విత్తన భాండాగారం" చేస్తామన్న కేసీఆర్ కనీసం ప్రత్యామ్నాయ విత్తనాలు కూడా అందించలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు. టీఆర్ఎస్ నేతలు స్వయంగా నకిలీ విత్తనాలు మార్కెట్ చేస్తున్నారు. ప్రభుత్వం సాయం లేక కౌలు రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. తెలంగాణలో పంటల ప్రణాళిక లేదు. ఓ సారి మక్క వద్దంటారు...ఇంకోసారి సన్న బియ్యం వేసుకోమంటారు...ప్రభుత్వానికి ప్లానింగ్ లేదు. అందుకే బియ్యంకు ధాన్యం సేకరణ కు ముడిపెట్టి రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు.

బద్నాం చేసేందుకే..
బీజేపీని ప్రజలలో బద్నాం చేసేందుకు టీఆర్ఎస్ ప్రయత్నం చేస్తోందన్నారు. కేంద్రం ఇచ్చిన టార్గెట్ను తెలంగాణ రాష్ట్రం ఇంకా పూర్తి చేయలేదని కిషన్ రెడ్డి అన్నారు. కేంద్రం ఇచ్చే బియ్యాన్ని టీఆర్ఎస్ నేతలు రీసైక్లింగ్ చేస్తున్నారు. రైతుల పేరు మీద ఎఫ్సీఐకి అమ్ముతున్నారని వివరించారు. కుటుంబ పాలన వైఫల్యాన్ని కేంద్ర ప్రభుత్వంపై రుద్దాలని చూస్తున్నారన్నారు. తమ విధానంలో ఎలాంటి మార్పు లేదన్నారు.

తప్పు చేసి...
తప్పు చేసి కేంద్రం మీద నెడుతారా.. గజ్వేల్కు ఒక పాలసీ, దుబ్బాకకు ఒక పాలసీ మేం అమలు చేయడం లేదన్నారు. దేశమంతటా ఒకే విధానాన్ని అమలు చేస్తున్నామని కిషన్ రెడ్డి తెలిపారు. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు కలిసి రైతులను ఒప్పించకుండా కేంద్రంపై నెపం వేస్తే ఎలా అని ప్రశ్నించారు. రైతులకు మేలు చేయాల్సింది పోయి కేంద్ర ప్రభుత్వంపై ద్వేషపూరిత భావం కలిగేలా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు.












Click it and Unblock the Notifications