పాశమైలారం పారిశ్రామికవాడలో భారీ అగ్ని ప్రమాదం: పెద్దమొత్తంలో ఆస్తి నష్టం
హైదరాబాద్: సంగారెడ్డి జిల్లాలోని పటాన్చెరు మండలం పాశమైలారం పారిశ్రామికవాడలో శనివారం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పటాన్చెరు మండలం పాశమైలారం పారిశ్రామికవాడలోని పెయింట్, రసాయన పరిశ్రమల్లో శనివారం మధ్యాహ్నం సమయంలో అకస్మాత్తుగా మంటలు ఎగిసిపడ్డాయి.
ముందుగా పెయింట్ పరిశ్రమలో మంటలు వచ్చాయి. వాటిని అదుపులోకి తీసుకురాలేకపోవడంతో పక్కనే ఉన్న రసాయన పరిశ్రమలోకి మంటలు వ్యాపించాయి. దీంతో రసాయనాలతో కూడిన డ్రమ్ములకు మంటలు అంటుకున్నాయి. మంటలు రసాయన పరిశ్రమ అంతటికి వ్యాపించడంతో యంత్రాలు కూడా దగ్ధమయ్యాయి.
మంటలను అదుపులోకి తెచ్చేందుకు సంగారెడ్డి, పటాన్చెరు, బీడీఎల్, బొల్లారం ప్రాంతాలకు చెందిన అగ్నిమాపక శకటాలు మంటలను అదుపులోకి తేవడానికి ప్రయత్నిస్తున్నాయి. భారీ స్థాయిలో అగ్ని ప్రమాదం జరగడంతో పరిశ్రమల చుట్టుపక్కల ప్రాంతమంతా దట్టమైన పొగ అలుముకుంది. దీంతో ఏం జరుగుతుందోనని స్థానికలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన కారణాలు తెలియాల్సి ఉంది. కాగా, ఈ అగ్ని ప్రమాదంతో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో నగరంలోని పలు పరిశ్రమల్లో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే.