దుబ్బాకలో అల్లుడు, గ్రేటర్లో కొడుకు సంగతి చూశాం.. సర్జికల్ కాదు..శాఫ్రాన్ స్ట్రైక్స్ జరిగాయి: బండి సంజయ్
గ్రేటర్ ఎన్నికల్లో కమలం వికసించింది. 3 డివిజన్ల నుంచి 43 డివిజన్లకు చేరింది. ఇప్పటికే 42 డివిజన్లలో గెలువగా.. 2 డివిజన్లలో లీడ్లో ఉంది. జీహెచ్ఎంసీలో మేయర్ పీఠం గెలుచుకోనున్న.. మెజార్టీ సీట్లు గెలిచినందున కమల దళంలో ఉత్సాహం నెలకొంది. ఈ విజయం కార్యకర్తలకు అంకితం అని బీజేపీ నేతలు అంటున్నారు. అనుకున్న స్థాయిలో తమకు డివిజన్లు దక్కాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. గతంలో కాంట్రాక్టర్లు, కార్పొరేటర్లకు బల్దియా వివాదం ఉండేదని.. ఇప్పుడు ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తామని వివరించారు.
అల్లుడు తర్వాత కొడుకు సంగతి చూశాం..
దుబ్బాకలో అల్లుడు హరీశ్ రావు సంగతి చూశామని బండి సంజయ్ అన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో కొడుకు కేటీఆర్ సంగతి చూశామని తెలిపారు. దుబ్బాక బై పోల్లో బీజేపీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. గ్రేటర్లో బీజేపీ రెండో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది. గ్రేటర్లో సర్జికల్ స్ట్రైక్ చేస్తామని అన్నాం కానీ జరగలే కానీ శాఫ్రాన్ స్ట్రైక్ (కాషాయ దాడి) జరిగిందని చెప్పారు. తమకు గురుతర బాధ్యత అప్పగించిన గ్రేటర్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. పార్టీ అధ్యక్షుడు నడ్డా, హోం మంత్రి అమిత్ షా, సాగర్ భూపతి యాదవ్కు కృతజ్ఞతలు తెలిపారు. భారత్ మాతా కీ జై అంటూ కార్యకర్తలను సంజయ్ ఉత్సాహ పరిచారు.
ఎస్ఈసీ, డీజీపీపై విమర్శలు
గ్రేటర్ ఫలితాల్లో ప్రజల తీర్పును శిరసా వహిస్తున్నామని సంజయ్ తెలిపారు. ఎస్ఈసీ, డీజీపీపై కూడా విరుచుకుపడ్డారు. కండువా కప్పుకున్న కార్యకర్త కన్నా ఎస్ఈసీ పనిచేశారని గుర్తుచేశారు. టీఆర్ఎస్ పార్టీ విజయం కోసం అహోరాత్రులు శ్రమించాని వివరించారు. అర్ధరాత్రి సర్క్యులర్ జారీచేసి.. హైకోర్టు చేత మొట్టికాయలు తిన్నారని గుర్తుచేశారు. అలాగే డీజీపీకి కూడా విజయం అంకితం చేస్తున్నామన్నారు. బీజేపీ కార్యకర్తలపై టీఆర్ఎస్ శ్రేణులు దాడి చేస్తే నిలువరించలేదని మండిపడ్డారు. ఎంఐఎం గుండాలు దాడి చేసినా.. పట్టనట్టు వ్యవహరించారని తెలిపారు.
అమ్మవారి దయవల్లే
భాగ్యలక్ష్మి అమ్మవారి దయవల్ల బీజేపీ విజయం సాధించిందని బండి సంజయ్ తెలిపారు. 4 సీట్ల నుంచి 40 సీట్లకు బీజేపీ చేరిందన్నారు. కానీ టీఆర్ఎస్ 99 స్థానాల నుంచి దిగజారిందని వివరించారు. దుబ్బాక బై పోల్, బల్దియా ఎన్నికలతో మార్పులు మొదలయ్యాయని చెప్పారు. త్వరలో పెను మార్పులు జరగడం ఖాయం అని విశ్వాసం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారం చేపట్టడం ఖాయం అని బండి సంజయ్, లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
అగ్రనేతల ప్రచారం
గ్రేటర్ ఎన్నికలను బీజేపీ తొలి నుంచి ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అగ్రనేతలతో ప్రచారం చేయించింది. యోగి ఆదిత్యనాథ్, అమిత్ షా తదితరులు ప్రచారం చేశారు. హైదరాబాద్ పేరు భాగ్యనగర్ అని కూడా మారుస్తామని చెప్పారు. వారి ప్రచారంతో ఒక వేవ్ మొదలైంది. దానిని ఓట్ల రూపంలో మలచడంలో స్థానిక బీజేపీ నేతలు సక్సెస్ అయ్యారు. బీజేపీ గాలిని చూసి 20-30 సీట్ల వరకు గెలుస్తుందనే అంచనాలు ఉండేవి. కానీ 44 వరకు గెలుచుకొని.. టీఆర్ఎస్ పార్టీకి మైండ్ బ్లాంకయ్యేలా షాక్ ఇచ్చింది.
Recommended Video