పెట్రో, డీజిల్, గ్యాస్ ధరలను ఎక్కడికో తీసుకెళ్లారు.. కేంద్రంపై కేటీఆర్ సెటైర్లు
తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్- బీజేపీ మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. పెట్రో ధరలు నిత్యం పెరుగుతూనే ఉన్నాయి. సిలిండర్ బండ ధర కూడా కొండెక్కింది. దీనిపై మంత్రి కేటీఆర్ కామెంట్స్ చేశారు. పెట్రోల్, డీజిల్.. గ్యాస్ ధరలను ప్రపంచంలోనే నెంబర్ వన్ స్ధానానికి తీసుకు వెళ్లిన ఘనత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దక్కుతుందని సెటైర్ వేశారు. ఆస్క్ కేటీఆర్ కార్యక్రమంలో నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.
కాంగ్రెస్ హయాంలో ఎల్పీజీ ధరలు పెరిగిన ప్రతీసారి ధర్నా చేసిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఇప్పుడు స్పందించకపోవటం హిపోక్రసీ అని కేటీఆర్ కామెంట్ చేశారు. 2024 ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలతో టీఆర్ఎస్ పార్టీ పోటీ ఇస్తోందని చెప్పారు. ప్రజల ఆశీర్వాదంతో సుపరిపాలన కొనసాగేలా వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తామన్నారు.

కర్ణాటకలో 2,500 కోట్లు ఇచ్చి సీఎం సీటు కొనుక్కోవచ్చని బీజేపీ అధిష్టానం చేసిన కామెంట్లు ఆ పార్టీ అసలు రంగును బయట పెట్టిందని అన్నారు. ఐఐఎం, ఐఐఐటీ, ఐఐఎస్ఈఆర్, ఎన్ఐడీ సంస్థల్లో ఒక్కటీ కేంద్రం రాష్ట్రానికి ఇవ్వలేదని చెప్పారు. బీఆర్ఎస్ అంశం హైకోర్టు వద్ద పెండింగ్లో ఉందని, బీఆర్ఎస్ సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని కేటీఆర్ తెలిపారు. రాష్ట్రంలో రైతు అనుకూల విధానాలతో ఏడేళ్లలో సాగు 120 శాతం పెరిగిందని కేటీఆర్ పేర్కొన్నారు.
నేరాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కేటీఆర్ హామీ ఇచ్చారు. హైదరాబాద్లో మూడు కొత్తగా టిమ్స్ ఆసుపత్రులను నిర్మిస్తున్నామని తెలిపారు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిని అప్డేట్ చేస్తున్నామని వివరించారు. ౩౩ జిల్లాల్లో వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. మెడికల్ కాలేజీలకు అనుబంధంగా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను నెలకొల్పుతామని వివరించారు.












Click it and Unblock the Notifications