16 పౌర సంఘాలపై నిషేధం ఎత్తివేయాలి.. సీజేఐకి పౌరహక్కుల సంఘం వినతి
రాష్ట్రంలో ప్రజాసంఘాలపై నిషేదాన్ని ఎత్తివేయాలని సీజేఐ జస్టీస్ ఎన్వీ రమణకు పౌరహక్కుల సంఘం సభ్యులు విజ్ఞప్తి చేశారు. రాజ్భవన్లో ఎన్వీ రమణకు పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ లక్ష్మణ్ వినతిపత్రాన్ని అందజేశారు. తెలంగాణ రాష్ట్రంలోని 16 పౌర హక్కుల సంఘాలపై నిషేధం విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 73 రద్దయ్యేలా చొరవ చూపాలని ఎన్వీ రమణను కోరారు.
ఎలాంటి నోటీసులు లేకుండానే సంఘాలపై నిషేధం విధించారని ప్రొఫెసర్ లక్ష్మణ్ పేర్కొన్నారు. ఈ ఏఢాది మార్చి 30న జీవో విడుదల కాగా... ఏప్రిల్ 24న పత్రికల్లో అధికారిక ప్రకటన వచ్చిందని తెలిపారు. జీవో నంబర్ 73లో ప్రభుత్వం పేర్కొన్నట్టు తాము ఎలాంటి చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడలేదని.. ప్రజా సమస్యలపైనే పోరాడుతున్నామని తెలిపారు. అలాగే మావోయిస్టులతో ఎలాంటి సంబంధాలు లేవని స్పష్టం చేశారు.
అటవీ భూములపై ఆదివాసీల హక్కులను గుర్తించాలని మాత్రమే కోరామని తెలిపారు. హాలియా ఎన్నికల సభలో సీఎం కేసీఆర్ కూడా దీనిపై స్పందించిన విషయాన్ని లేఖలో గుర్తు చేశారు. అరెస్ట్ చేసిన వరవరరావు, సాయిబాబా లాంటి పౌరహక్కుల నేతలను వెంటనే విడుదల చేయాలని తాము కోరామని.. బెయిల్ కోరడం అనేది రాజ్యాంగం ఇచ్చిన హక్కు అని తెలిపారు.
తమ సభ్యులెవరు అజ్ఞాతంలోకి వెళ్లిన చరిత్ర గత 48 ఏళ్లలో లేదన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందు పౌరహక్కుల సంఘాలపై ప్రశంసలు కురిపించారని.. కానీ ఇప్పుడు సీఎం పీఠం ఎక్కాక ఉక్కుపాదం మోపుతున్నారని వినతిపత్రంలో వివరించారు.