Coronavirus: రెండు చేతులు జోడించి చెబుతోన్న, కరోనాపై ప్రజలకు సీఎం కేసీఆర్ మరోసారి వినతి..
కరోనా వైరస్ను ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నద్ధంగా ఉంది. ఏ పరిస్థితినైనా ఎదుర్కొంటామని సర్కార్ చెబుతోంది. కానీ ప్రజలు స్వీయ నియంత్రణ పాటించడమే శ్రీరామరక్ష అని స్పష్టంచేసింది. ఏమవుతుందిలే అనే అశ్రద్ధ వద్దు అని జాగ్రత్తతో మెలగాలని సీఎం కేసీఆర్ ప్రజలకు సూచించారు. మార్చి 31వ తేదీ వరకు ఉన్న లాక్డౌన్ను ఏప్రిల్ 15 వరకు పొడిగిస్తున్నట్టు స్పష్టంచేశారు. శుక్రవారం ఒక్కరోజు 10 పాజిటివ్ కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోందని.. లాక్డౌన్, కర్ఫ్యూ లేకుంటే పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోవడం కష్టంగా ఉందన్నారు. సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో మీడియాతో మాట్లాడారు.

59కి చేరిన కేసులు
రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు 59కి చేరాయని, అందులో ఒకరు వ్యాధి తగ్గి డిశ్చార్జ్ అయ్యారని సీఎం కేసీఆర్ తెలిపారు. 20 వేల మంది క్వారంటైన్లో ఉన్నారని పేర్కొన్నారు. వీరంతా ప్రభుత్వ పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నారని తెలిపారు. కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోందని.. అమెరికా కూడా వణికిపోతోందని కేసీఆర్ వివరించారు. న్యూయార్క్ రాష్ట్రంలో 11 వేల వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఒక్క న్యూయార్క్ సిటీలో 3 వేల వెంటిలేటర్లు ఉన్నాయని చెప్పారు. కానీ వారికి 30 వేల వెంటిలేటర్లు అవసరమవుతున్నాయని గుర్తుచేశారు.

అల్లాడిపోతోన్న అమెరికా..
అమెరికా లాంటి అగ్రదేశం, ఆయుధ సంపత్తి, సంపద కలిగిన దేశం కరోనా వైరస్ను ఎదుర్కొలేకపోతుందని చెప్పారు. మన వద్ద ఆ స్థాయిలో వెంటిలేటర్లు లేవని చెప్పారు. అందుకే మనం సామాజిక దూరంగా ఉంటూ.. వ్యాధిని ఎదుర్కొవాలని సూచించారు. అమెరికా, చైనా, స్పెయిన్, ఇటలీ మాదిరిగా దేశంలో కరోనా వ్యాప్తి చెందితే దేశంలో 20 కోట్ల మంది చనిపోతారు అని కేసీఆర్ పేర్కొన్నారు. దీనికి ఎవరూ అతీతులు కారని పేర్కొన్నారు. అధికారులు, మంత్రులు, ముఖ్యమంత్రికి కూడా కరోనా పాజిటివ్ వస్తోందని చెప్పారు.

మోడీ భరోసా
కరోనా వైరస్పై ప్రధాని మోడీతో మాట్లాడనని కేసీఆర్ వివరించారు. తెలంగాణ రాష్ట్రం తీసుకుంటున్న చర్యలను మోడీ అభినందించారని, ఎలాంటి సాయం కోసం, ఏ సమయంలోనైనా తనను సంప్రదించాలని కోరారని పేర్కొన్నారు. 80.09 శాతం మంది ఇంటి వద్ద క్వారంటైన్లో ఉండి చికిత్స తీసుకుంటున్నారని కేసీఆర్ వివరించారు. 13.8 శాతం మంది ఆస్పత్రుల్లో ఐసోలేషన్ వార్డులో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారని తెలిపారు. 4.7 శాతం మంది పరిస్థితి మాత్రం తీవ్రంగా ఉందని.. వారికి ఆస్పత్రిలో వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారని చెప్పారు.

12 వేల 400 బెడ్లు
రాష్ట్రంలో కరోనాను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సర్వసన్నద్ధంగా ఉంది అని కేసీఆర్ తెలిపారు. 11 వేల మంది రోగులను ఆస్పత్రిలో ఐసోలేషన్ ఉంచే వెసులుబాటు ఉందని.. 1400 ఐసీయూ క్రిటికల్ కేర్ బెడ్స్ ఉన్నాయని చెప్పారు. మొత్తం 12 వేల 400 బెడ్లు అందుబాటులో ఉన్నాయన్నారు. 60 వేల మందికి పాజిటివ్ తేలిన చికిత్స అందించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం 8 వేల మంది వైద్యులు ట్రీట్మెంట్ అందజేస్తున్నారని.. రిటైర్డ్ 11 వేల మంది వైద్యుల సేవలను కూడా తీసుకుంటామని వివరించారు. ఎంబీబీఎస్ చేసి పీజీ చేస్తోన్న వారి సేవలను కూడా తీసుకుంటామని పేర్కొన్నారు. వైరస్ను తరిమికొట్టేందుకు ప్రభుత్వం, అధికారులు, సిబ్బంది, పోలీసులు కష్టపడి పనిచేస్తున్నారని.. తమకు ప్రజలు సహకరించాలని కేసీఆర్ కోరారు.

50 లక్షల ఎకరాల్లో పంట
రాష్ట్రంలో 50 లక్షల ఎకరాల్లో పంట చివరి స్టేజీలో ఉంది అని కేసీఆర్ తెలిపారు. ఎస్సారెస్పీ, కాళేశ్వరం, నాగార్జునసాగర్, జురాల ఆయకట్టు కింద ఏప్రిల్ 10వ తేదీ వరకు నీరు ఇవ్వాలని అధికారులను ఆదేశించామన్నారు. చివరి ఎకరాం పండేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మరికొందరు బావులు, బోర్ల మీద పంట పండిస్తున్నారని.. వారి కోసం 15 రోజులు నిరంతరాయంగా కరెంట్ సరఫరా చేస్తామని తెలిపారు. ఇందుకు విద్యుత్ సిబ్బంది కష్టపడాలని కేసీఆర్ సూచించారు. వ్యవసాయ మార్కెట్లు మూసివేశామని.. ఆయా గ్రామాల్లో పంట కొనుగోలు చేస్తామని కేసీఆర్ భరోసా ఇచ్చారు. ప్రతీ రైతు పంటను కొనుగోలు చేస్తామని.. బ్యాంక్ ఖాతా నంబర్ ఇస్తే చాలు, ఖాతాలో డబ్బులు వేస్తామని చెప్పారు. నెలరోజుల్లోపు డబ్బులు వేస్తామని, ఆందోళనకు గురి కావొద్దని రైతులను కోరారు.
Recommended Video

అందరికీ అన్నం పెడతాం
రాష్ట్రంలో ఉన్న ఇతర రాష్ట్రాల వారికి సరైన వసతి కల్పిస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. హైదరాబాద్లో ఉన్న హాస్టళ్లు మూసివేయబోమని, ఏపీ విద్యార్థులు ఆందోళనకు గురికావొద్దని సూచించారు. యాచకులు, ఆనాధలు, కూలీల ఆహారం కోసం చర్యలు తీసుకుంటామని తెలిపారు. పశుగ్రాసం, కూరగాయాలు, పండ్లు, నిత్యావసర వస్తువుల వాహనాలను అనుమతిస్తామని చెప్పారు. చికెన్, గుడ్లు తినొచ్చని రోగ నిరోధక శక్తి పెరిగేందుకు దోహదపడుతోందని వివరించారు. నిమ్మ, సంత్ర, బత్తాయి, మామిడి పండ్లు తీసుకోవాలని సీఎం కేసీఆర్ సూచించారు. విటమిన్ సీ తో రక్కసిని ఎదుర్కొవచ్చని తెలిపారు.












Click it and Unblock the Notifications