అలా చేయండి..: ప్రధాని మోడీకి కేటీఆర్ కీలక సూచనలు
హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్ కేసులో దోషులకు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా జైలు నుంచి విముక్తి కల్పించడం పట్ల దుమారం చెలరేగుతోంది. ఇప్పటికే అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధినేత, లోక్సభ సభ్యుడు రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష పార్టీలకు చెందిన పలువురు నాయకులు దీనిపై ఘాటు విమర్శలు గుప్పించారు. గుజరాత్లో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ వైఖరిని తప్పుపట్టారు.
తాజాగా టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్.. దీనిపై స్పందించారు. బిల్కిస్ బానోపై అత్యాచారానికి పాల్పడిన నిందితులను గుజరాత్ ప్రభుత్వం జైలు నుంచి విడిచిపెట్టడంపై మండిపడ్డారు. సభ్య సమాజానాకి బీజేపీ ప్రభుత్వం ఎలాంటి సందేశాన్ని ఇస్తోందని ప్రశ్నించారు. స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశం మొత్తం సంబరాలు జరుపుకొంటోన్న వేళ.. గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని వ్యాఖ్యానించారు.
బిల్కిస్ బానో రేపిస్టులను విడుదల చేయడం, పైగా వారికి ఘన స్వాగతం పలకడంలో అర్థం లేదని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై ఆయన తన మౌనాన్ని వీడాలని అన్నారు. సొంత పార్టీ ప్రభుత్వం అధికారంలో తన సొంత రాష్ట్రంలో గ్యాంగ్ రేపిస్టులు జైలు నుంచి విడుదల కావడం ప్రమాదకర సంకేతాలను పంపించినట్టయిందని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
ఇలాంటి సంఘటనలు మళ్లీ మళ్లీ చోటు చేసుకోకుండా ఉండటానికి కొన్ని కఠిన నిర్ణయాలను తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇండియన్ పీనల్ కోడ్, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్, జువైనల్ జస్టిస్ చట్టాల్లో మార్పులను తీసుకుని రావాల్సి ఉందనే ఈ ఉదంతం గుర్తు చేస్తోందని అన్నారు. గ్యాంగ్ రేప్కు పాల్పడి దోషులుగా శిక్షను అనుభిస్తోన్న వారిని ఏ ప్రాతిపదికన గుజరాత్ ప్రభుత్వం విడిచి పెట్టిందో వెల్లడించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
2002లో గోధ్రా రైలు దగ్ధం అనంతరం గుజరాత్లో చోటు చేసుకున్న అల్లర్ల సందర్భంగా బిల్కిస్ బానో అత్యాచారానికి గురైన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఆమె అయిదు నెలల గర్భిణి. ఆమె మూడేళ్ల కుమార్తె సహా ఏడుమంది కుటుంబ సభ్యులను అల్లరిమూకలు దారుణంగా హత్య చేశాయి. ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాయి. ఈ కేసులో శిక్షను అనుభవిస్తోన్న వారిని స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గుజరాత్ ప్రభుత్వం జైలు నుంచి విడిచిపెట్టింది.