భారీ హవాలా నగదు స్వాధీనం... హైదరాబాద్ బంజారాహిల్స్లో నిందితుల పట్టివేత...
హైదరాబాద్లోని బంజారాహిల్స్లో హవాలా మార్గంలో తరలిస్తున్న భారీ నగదును టాస్క్ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో నిఘా పెట్టిన పోలీసులు... మంగళవారం(సెప్టెంబర్ 15) బంజారాహిల్స్లో రెండు కార్లను ఆపి తనిఖీలు చేశారు. అందులో రూ.3.75కోట్లు నగదును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. కార్లలో ఉన్న నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ వెల్లడించిన ప్రకారం... ముంబై కేంద్రంగా పనిచేసే ఓ సంస్థకు హైదరాబాద్ బంజారాహిల్స్లో ఓ బ్రాంచి ఉంది.శాఖ కార్యకలాపాలను గిరి,రాథోడ్ అనే వ్యక్తులు పర్యవేక్షిస్తున్నారు. ఇటీవల ముంబై కార్యాలయం నుంచి దిలీప్,హరీష్ అనే వ్యక్తులు హైదరాబాద్ వచ్చారు. మంగళవారం ఆ ఇద్దరు,ఈ ఇద్దరు కలిసి చెరో కారులో ఎక్కడికో బయలుదేరారు.
కారులో భారీగా నగదును తరలిస్తున్నట్లు అప్పటికే పోలీసులకు సమాచారం అందింది. దీంతో కార్లను వెంబడించిన పోలీసులు వాటిని ఆపి తనిఖీలు చేయగా రూ.3.75కోట్లు నగదు బయటపడింది. దానికి సంబంధించి వారి వద్ద ఎటువంటి లెక్కాపత్రం లేకపోవడంతో పోలీసులు నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆ డబ్బును ఆదాయపు పన్ను శాఖ అధికారులకు అప్పగిస్తామని పోలీసులు తెలిపారు.