29 రోజులకు 24 లక్షల బిల్లు.. భాగ్యనగరంలో ఓ ప్రైవేట్ ఆస్పత్రి తీరు ఇదీ...
కరోనా సెకండ్ వేవ్ భయభ్రాంతులకు గురిచేస్తోంది. వైరస్ సోకడమే కాదు.. కోలుకుని వస్తోన్న రకరకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఇక కరోనా పేరుతో ఆస్పత్రిలో చేరితే అంతే సంగతులు.. మినిమం 2 నుంచి 3 లక్షలు వసూల్ చేయడం కామన్. జాయిన్ అయ్యే సమయంలో రూ.1 లక్ష నుంచి.. 2, 3 లక్షల వరకు అడ్వాన్స్ కట్టించుకుంటున్నారు. ఇక భాగ్యనగరంలో ఓ కార్పొరేట్ ఆస్పత్రి తీరు మరోలా ఉంది. నెల వరకు ఉంచుకొని.. పాతిక లక్షల వరకు బిల్లు వేశారు. దీంతో బంధువులు నోరెళ్లబెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.
24 లక్షల బిల్లా...
హైదరాబాద్ నాగోల్ లో ఇలాంటి ఘటన ఒకటి వెలుగుచూసింది. ఓ ప్రైవేట్ ఆసుపత్రి కరోనా చికిత్సకు గాను 29 రోజులకు ఏకంగా 24లక్షలు బిల్లు వేసింది. నాగోలు సమీపంలో ఓ ప్రైవేటు ఆసుపత్రి కరోనా బాధితుడి వైద్య ఖర్చులకు వేసిన బిల్లు చూసి బాధితుడి గుండె గుభేల్మంది. నల్గొండ జిల్లాకు చెందిన ఒకతను కరోనాతో ఏప్రిల్ 15న ఆసుపత్రిలో చేరారు. ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. గురువారం (నిన్న) డిశ్ఛార్జి చేసే ముందు రూ. 24 లక్షల బిల్లు చేతికిచ్చారు. దీంతో బాధితుడు, అతడి బంధువులు షాక్ తిన్నారు.
బిల్ కడితేనే పంపుతాం..
రూ.24 లక్షలు చెల్లిస్తేనే ఇంటికి పంపుతామని ఆసుపత్రి యాజమాన్యం స్పష్టం చేయడంతో బాధితుడి బంధువులు వైద్యశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రోజుకు కొవిడ్ బాధితుడికి ఐసీయూకు రూ. 9వేలు, ఆక్సిజన్ బెడ్కు రూ.7వేలు, సాధారణ వార్డుకు రూ.4వేలు చొప్పున మాత్రమే తీసుకోవాలి. కానీ, ప్రైవేట్ ఆసుపత్రులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి.
చర్యలు తప్పవు
కరోనా కష్టకాలంలో రోగులకు అండగా నిలవాల్సిన ఆసుపత్రులు అమానవీయంగా వ్యవహరిస్తున్నాయి. కాసుల కోసం అడ్డదారులు తొక్కుతున్నాయని బాధితులు అంటున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి డబ్బులు దండుకునే ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.