ధైర్యంగా ఉండండి.. నిందితులను కఠినంగా శిక్షిస్తాం.. ప్రియాంక కుటుంబానికి మంత్రి సబితా పరామర్శ
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రియాంక రెడ్డి హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. నలుగురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇక వెటర్నరీ డాక్టర్ ప్రియాంకా రెడ్డి హత్య కేసును పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సైతం చాలా సీరియస్ గా తీసుకున్నారు. స్వయంగా ఆయనే ఈ కేసును మానిటర్ చేస్తున్నారు. ఇక ఇదే విషయాన్ని కేటీఆర్ ట్విట్టర్ వేదికగా తెలియజేశారు.ఇక బాధిత కుటుంబాన్ని మంత్రి సబితా ఇంద్రా రెడ్డి పరామర్శించారు.
పర్సనల్ గా ఈ కేసును పర్యవేక్షిస్తున్న కేటీఆర్
ప్రియాంకారెడ్డి హత్యకేసుపై స్పందించిన మంత్రి కేటీఆర్ ఈ కేసును తాను పర్సనల్గా మానిటర్ చేస్తున్నట్లు ట్వీటర్లో తెలిపారు. కేసు వివరాలను పోలీసులను ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటున్నామని, ఈ దారుణానికి పాల్పడిన మానవ మృగాలను కఠినంగా శిక్షించాలని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా పోలీసులను కోరినట్లుగా ఆయన ట్వీట్ చేశారు. బాధిత కుటుంబానికి సత్వర న్యాయం అందేలా చేస్తామని అన్నారు. ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే 100 నంబర్కు కాల్ చేయాలని మంత్రి కేటీఆర్ సూచించారు.
ప్రియాంకా రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి
మహిళల రక్షణకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన ఈ ట్వీట్ ద్వారా అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక ప్రియాంక రెడ్డి హత్య నేపథ్యంలో దుఃఖసాగరం లో ఉన్న ప్రియాంక రెడ్డి కుటుంబాన్ని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరామర్శించారు. బాధిత కుటుంబానికి సబితా ఇంద్రారెడ్డి ధైర్యం చెప్పారు. ప్రియాంక తల్లిదండ్రులను ఓదార్చిన మంత్రి ఈ కేసులో నిందితులను కఠినంగా శిక్షిస్తామని తెలిపారు.
పోలీసులకు కాల్ చేసి ఉంటే ఇంత ఘోరం జరిగేది కాదన్న మంత్రి సబిత
ఇల్లు, ఉద్యోగం తప్ప తమ కుమార్తెకు మరొకటి తెలియదని విలపిస్తున్నప్రియాంక తల్లిఆవేదన ఎవరూ తీర్చలేనిదన్నారు. ప్రియాంక లేని లోటు ఆ కుటుంబానికి తీవ్ర వేదనకు గురి చేస్తుందని సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు.మహిళల భద్రతకు తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పారు.మహిళలు అందరూ షీటీమ్స్ ఫోన్ నెంబర్స్ దగ్గర ఉంచుకోవాలని తెలిపారు సబితా ఇంద్రారెడ్డి. ప్రియాంక పోలీసులకు కాల్ చేసి ఉంటే దారుణం జరిగేది కాదని మంత్రి అభిప్రాయపడ్డారు.
Recommended Video
దర్యాప్తు వేగం పెంచిన పోలీసులు... మధ్యాహ్నం వరకే కేసు తేల్చే అవకాశం
మహిళలందరూ విపత్కర పరిస్థితుల్లో 100కు డయల్ చేసి పోలీసుల సహకారం తీసుకోవాలని సబితా ఇంద్రారెడ్డి సూచించారు. ఇక పోలీస్ శాఖ కూడా ఈ విషయంలో ప్రజల్లో చైతన్యం తీసుకురావటానికి ప్రయత్నిస్తుంది. ఇక మరో వైపు పోలీసులు ఈ కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు. మధ్యాహ్నం వరకే ఈ కేసును తేల్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఏది ఏమైనా మరో నిర్భయ లాంటి ఘటన ఇది అని దేశం మొత్తం ఈ ఘటన నేపధ్యంలో ఆవేదన చెందుతుంది.