హైదరాబాద్లో పలు చోట్ల వర్షం: 3 రోజులపాటు తెలంగాణ వ్యాప్తంగా జోరు వానలు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రానున్న మూడు రోజులపాటు పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
నైరుతి రుతుపవనాలు ఆదివారం కర్ణాటక, పుదుచ్చేరి, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించాయి. దిగువ స్థాయిలోని గాలులు ముఖ్యంగా పశ్చిమ దిశ నుంచి తెలంగాణ వైపు వీస్తున్నాయి. ఆది, సోమవారాల్లో రాష్ట్రంలో అక్కడక్కడ వడగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు.

ఆదివారం ఖమ్మం, కొత్తగూడెం, ఆదిలాబాద్, కుమురంభీమ్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో వడగాలులు వీచాయి. మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిశాయి. హైదరాబాద్ నగరంలోనూ ఆదివారం సాయంత్రం నుంచి పలు ప్రాంతాల్లో వర్షం పడింది. ఈదురుగాలు వీచాయి. ఎస్సార్ నగర్, మోతినగర్, బోరబండ, కాకతీయ హిల్స్, మాదాపూర్, తదితర ప్రాంతాల్లో వాన పడింది. నగర శివారు ప్రాంతాల్లోనూ వర్షం కురిసింది.
ఆదిలాబాద్, కుమురంభీమ్, మంచిర్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో సోమవారం వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది ఇలావుండగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. తిరుపతి జిల్లా శ్రీహరి కోట సమీప ప్రాంతాలపై నైరుతి రుతుపవనాలు విస్తరించాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది.
ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు ఉత్తర కోన శ్రీహరికోట, కర్ణాటక, తమిళనాడులోని ధర్మపురి, రత్నగిరి, శివమొగ్గ, హాసన్ తదితర ప్రాంతాలపై ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్లోని మరిన్ని ప్రాంతాలకు నైరుతి పవనాలు విస్తరించేందుకు అనువైన పరిస్థితులు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రాగల 24 గంటల్లో రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాల ప్రభావంతో వానలు కురిసే అవకాశముందని పేర్కొంది.












Click it and Unblock the Notifications