మళ్లీ వాన.. నేడు హైదరాబాద్లో జల్లులు: వాతావరణ శాఖ
హైదరాబాద్ నగరంలో గురువారం సాధారణం కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ శాఖ వెల్లడించింది. శుక్రవారం నగరంలోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొన్నది. గురువారం హైదరాబాద్లో 20.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు కాగా, అత్యల్పంగా శేరిలింగంపల్లిలో 17.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.
తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ అంచనాల ప్రకారం.. శుక్ర, శనివారాల్లో 2.5 మి.మీ. వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉందని తెలిపింది. గురువారం మధ్యాహ్నం నుంచి నగరంలో పూర్తిగా వాతావరణం మారిపోయింది. ఆకాశం మేఘావృతమై, చల్లని గాలులు వీచాయి. కనిష్ట ఉష్ణోగ్రత 18 డిగ్రీల సెల్సియస్ నుంచి 20 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉంది. అయితే గరిష్ట ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్ వరకు పెరిగే అవకాశం ఉంది.
ఈ సారి వర్షాలు ఎక్కువే కురిసాయి. తెలుగు రాష్ట్రాలపై ప్రభావం ఎక్కువగానే ఉంది. ఇక ఏపీ గురించి అయితే చెప్పక్కర్లేదు. మొన్నటివరకు కురిసిన వర్షాలతో అక్కడి ప్రజల బాధ వర్ణణాతీతం. గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లో వరి కోతలు సమయంలో భారీ వర్షాలు కురిసాయి. తిరుమల, తిరుపతి.. చిత్తూరు జిల్లాలో అయితే పరిస్థితి మరీ దారుణం. తమిళనాడు భారీవర్షాలతో అల్లకల్లోలం అయిపోయింది. ఇప్పటికీ రాష్ట్రంలోని చాలా ప్రాంతాలు ముంపులో ఉన్నాయి. చెన్నైలోని చాలా కాలనీలు పూర్తిగా జలదిగ్బంధం నుంచి కోలుకోలేదు.
ఇటు ఏపీలో వానలు కురిసే ప్రక్రియ కంటిన్యూ అవుతుంది. వర్షాలతో రాయలసీమ, దక్షిణ కోస్తా ఇంకా కోలుకోలేదు. నెల వ్యవధిలో రెండు సార్లు అతి భారీ వర్షాలతో నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాలు అతలాకుతలం అయ్యాయి. ఇటీవల కురిసిన వర్షాలతో రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాలు కోలుకోవడం లేదు. నెల్లూరు, కడప జిల్లాల్లో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి.