ఇప్పుడు ఆ శరీరాలు ఏం చేసుకోవాలి: దిశ నిందితుల కుటుంబసభ్యుల కన్నీరు
హైదరాబాద్: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ సామూహిక అత్యాచారం, హత్య కేసులో హైకోర్టు ఆదేశాల మేరకు సోమవారం నలుగురు నిందితుల మృతదేహాలకు రీ పోస్టుమార్టం నిర్వహించారు. ఢిల్లీ నుంచి వచ్చిన ఎయిమ్స్ వైద్యుల బృందం సికింద్రాబాద్లోని గాంధీ ఆస్పత్రిలో రీపోర్టుమార్టం పూర్తి చేశారు. సుమారు 4గంటలపాటు ఈ పక్రియ కొనసాగింది.
ఎముక ఎముక స్కాన్, 5.15 గంటలపాటు ప్రక్రియ, దిశ నిందితుల మృతదేహాలకు రీ పోస్టుమార్టం
ఆ వైద్యులతో సంబంధం లేకుండానే..
కాగా, మృతుల కుటుంబసభ్యుల సమక్షంలోనే వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. గతంలో పోస్టుమార్టం చేసిన వైద్య బృందానికి సంబంధం లేకుండా రీపోస్టుమార్టం నిర్వహించినట్లు గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రవణ్ తెలిపారు. ఈ ప్రక్రియను ఎయిమ్స్ బృందం వీడియో చిత్రీకరణ చేసిందని వెల్లడించారు.
స్వగ్రామాలకు మృతదేహాలు..
రెండ్రోజుల్లోగా రీపోస్టుమార్టం నివేదికను ఎయిమ్స్ వైద్యులు సీల్డ్ కవర్లో హైకోర్టుకు సమర్పించనున్నారు. పోస్టుమార్టం అనంతరం సంతకాలు తీసుకుని నలుగురు నిందితుల మృతదేహాలను వారి బంధువులకు పోలీసులు అప్పగించారు. రెండు అంబులెన్స్ల్లో మృతదేహాలను వారి స్వగ్రామాలకు తరలించారు. సోమవారం రాత్రి నిందితుల మృతదేహాలకు వారి బంధువులు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఇప్పటికే నిందితుల గ్రామాల్లో అంత్యక్రియలకు ఏర్పాట్లు పూర్తి చేశారు. కాగా, మృతదేహాలు స్వగ్రామాలకు చేరుకోవడంతో నిందితుల కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
తీసుకుపోయి చంపేశారు.. ఎలా బతికేది..
కుటుంబాన్ని పోషించేవాడిని కోల్పోయామని, తాము ఇప్పుడు ఎలా బతకాలని నిందితుడు మొహ్మద్ ఆరిఫ్ తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. బాబును తీసుకుపోయి పోలీసులు చంపారని.. తమకు ఏమైనా సాయం చేయాలని ఆమె కోరారు. తమకు తమ కొడుకును కూడా ఇప్పటివరకు చూపించలేదన్నారు. ఇప్పుడు బాడీని తీసుకొచ్చి తెచ్చిస్తామంటే ఏం చేయాలని ప్రశ్నించారు. తమకు ఏదైనా ఆధారం చూపించాలని కోరుతున్నారు.
చెన్నకేశవులు భార్య కన్నీరు..
తన భర్తను ఆ రోజు ఉదయం 3గంటలకు తీసుకుపోయారని.. తమకు చూపలేదని మరో నిందితుడు చెన్నకేశవులు భార్య కన్నీటిపర్యంతమయ్యారు. ఇప్పుడు తన భర్త బాడీని పంపిస్తే తాము ఏం చేయాలని ప్రశ్నించారు. తమకు ప్రభుత్వం న్యాయం చేయాలని ఆమె కోరారు. తన కుటుంబానికి ఆధారంగా ఉన్న తన భర్తను చంపేశారు.. ఇప్పుడు తాము ఎలా బతకాలని నిలదీశారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వేడుకున్నారు. దిశపై మహ్మద్ ఆరిఫ్, చెన్నకేశవులు, శివ, నవీన్ అనే నిందితులు అత్యాచారానికి పాల్పడి, దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే.