కూతురు గెలుపు కోసం ప్రజాస్వామ్యం ఖూనీ.. కేసీఆర్పై నిప్పులు చెరిగిన రేవంత్..
నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. కూతురు గెలుపు కోసం సీఎం కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని విమర్శించారు. స్థానిక ప్రజా ప్రతినిధులను భయభ్రాంతులకు గురిచేసి టీఆర్ఎస్ కండువాలు కప్పుతున్నారని మండిపడ్డారు. శుక్రవారం(మే 22) రేవంత్ రెడ్డి, మరో కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీతో కలిసి దీనిపై ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్ గోయల్కు ఫిర్యాదు చేశారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి, విప్ గోవర్ధన్పై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఈసీని రేవంత్రెడ్డి కోరారు.

ఈసీకి ఫిర్యాదు చేసిన రేవంత్..
కానిస్టేబుల్ దయాకర్ రెడ్డి కరోనాతో మరణిస్తే అనాధలా దహనం చేశారని విమర్శించారు. రాష్ట్ర హోంమంత్రి కనీసం కానిస్టేబుల్ కుటుంబాన్ని పరామర్శించకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. కరోనాతో చనిపోయిన కానిస్టేబుల్ కుటుంబానికి రూ.కోటి ఎక్స్గ్రేషియా ఇవ్వాలని రేవంత్రెడ్డి డిమాండ్ చేశారు. తన కూతురు కవితను దొడ్డిదారిన ఎమ్మెల్సీ చేయాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. నిజామాబాద్లో ప్రజాస్వామ్యాన్ని బతికించాలని కాంగ్రెస్ నేతలు ఈసీకి విజ్ఞప్తి చేశారు.

మాటల గారడీతో మోసం చేస్తున్నారని..
గురువారం మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ 29వ వర్ధంతిని పురస్కరించుకుని కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్లో ఏర్పాటు చేసిన పార్టీ కార్యక్రమంలోనూ రేవంత్ కేసీఆర్పై నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ తన మాటల గారడీతో తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. ఈరోజు ఉన్న ప్రాజెక్టులన్నీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా నిర్మించినవేనని చెప్పారు. వర్షాలు బాగా కురవడంతో ప్రాజెక్టుల్లోకి నీరు వచ్చి చేరడంతో.. టీఆర్ఎస్ పార్టీ ఫోటోలు దిగి ప్రచారం చేసుకుంటోందని ఎద్దేవా చేశారు.

మంచి రోజులు వస్తాయని కార్యకర్తలకు భరోసా..
ప్రభుత్వం వల్ల ఎవరూ ఆందోళన చెందవద్దని కాంగ్రెస్ కార్యకర్తలకు భరోసానిచ్చారు. ఎండాకాలం తర్వాత వానాకాలం వచ్చినట్టే.. మనకూ మంచి రోజులు వస్తాయని చెప్పారు. అప్పుడు మిత్తితో సహా లెక్క చెల్లిద్దామని అన్నారు. మంచి రోజులు ఎంతో దూరంలో లేవని.. కాంగ్రెస్ శ్రేణులు ఆత్మవిశ్వాసంతో పనిచేయాలని అన్నారు.యువత రాజీవ్ గాంధీని స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. దళిత, బడుగు, బహుజన, మైనార్టీ వర్గాల అభ్యున్నతి కాంగ్రెస్తోనే సాధ్యమన్నారు. వ్యవసాయం, ఐటీ రంగానికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చింది కాంగ్రెస్ పార్టీనే అన్నారు.












Click it and Unblock the Notifications