అన్నీ కోర్టులే చేస్తే.. కేసీఆర్ గాడిద పళ్లు తోముతున్నారా?: సమరభేరి సభలో రేవంత్ రెడ్డి ఫైర్
హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు అండగా ఉండేందుకు వచ్చిన వారందరికీ ఆర్టీసీ కార్మికుల తరపున ధన్యవాదాలు చెబుతున్నట్లు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ ఆర్టీసీ సంఘాల నేతలు కార్మికుల ఆధ్వర్యంలో బుధవారం సరూర్నగర్లో సకల జనుల సమరభేరి జరిగింది. ఈ సభలో రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు.
కేసీఆర్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా..
కేసీఆర్ కుటుంబం చేతిలో బందీ అయిన తెలంగాణ విముక్తి కోసం మందకృష్ణ ఆధ్వర్యంలో ఆనాడు ధర్మయుద్ధం చేశామని.. ఇప్పుడు కార్మికుల సమ్మెకు అనుకూలంగా తెలంగాణ సమాజం సకల జనుల సమరభేరి జరుగుతోందని అన్నారు. కేసీఆర్ సర్కారు నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు నడుంబిగించారని రేవంత్ అన్నారు.
తెలంగాణ బిడ్డల పోరాట స్ఫూర్తి..
కోర్టు సభకు అనుమతిచ్చి 24గంటల కాకపోయినప్పటికీ తెలంగాణ మారుమూల ప్రాంతాల నుంచి కూడా ప్రజలు ఈ సభకు రావడం తెలంగాణ బిడ్డల పోరాటానికి స్ఫూర్తి అని రేవంత్ రెడ్డి అన్నారు. ప్రధానంగా మూడు అంశాలున్నాయని.. వాటిలో ఒకటి ఆర్టీసీ సమస్యల పరిష్కారం, రెండోది కార్మికుల పట్ల ప్రభుత్వం వైఖరి, మూడోది ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం అని తెలిపారు.
ఇవన్నీ మేనిఫెస్టోలో పెట్టారా? కేసీఆర్?
సీఎం కేసీఆర్ తోపాటు మంత్రులు ఆర్టీసీ విలీనం సాధ్యం కాదంటూ వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎర్రబెల్లి దయాకర్ రావు ఊసరవెల్లిలా మాట్లాడుతూ.. తమ ఏజెండాలో లేదని అంటున్నారని ధ్వజమెత్తారు. ఆర్టీసీలో ప్రభుత్వం 50శాతం బస్సులను నడుపుతుందని, 30శాతం బస్సులను అద్దెకు ఇస్తామని, 20శాతం మెగా కృష్ణారెడ్డికి ఇస్తామని కేసీఆర్ ఏమైనా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారా? అని రేవంత్ రెడ్డి నిలదీశారు.
నీ కుటుంబానికి పదవులిస్తామని చెప్పారా?
ఆర్టీసీ నడ్డి విరగ్గొట్టేందుకే కేసీఆర్ సర్కారు డీజిల్పై 27.5శాతం వ్యాట్ విధించిందన్నారు. నీ కుటుంబంలో నీతోపాటు నీ కుటుంబసభ్యులకు ప్రభుత్వంలో పదవులు ఇస్తామని ఏమైనా మేనిఫెస్టోలో చెప్పారా? అని సీఎం కేసీఆర్ను రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. లక్షలాది మంది కార్మికులకు మేలు జరిగే ఆర్టీసీ విలీన నిర్ణయాన్ని ఎందుకు తీసుకోరంటూ ప్రశ్నించారు.
కేసీఆర్.. గాడిద పళ్లు తోముతున్నారా.?
అన్ని సమస్యలకు తెలంగాణ రాష్ట్రమే పరిష్కారం అన్న కేసీఆర్.. ఆయనే సమస్యగా మారారని రేవంత్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఇంతమంది కార్మికులు ఎందుకు వచ్చారో తెలియదా? ప్రశ్నించారు. ఆడబిడ్డల చీరలు చిరగలేదా? మీ పోలీసుల చేతిలో అని నిలదీశారు. సమస్యలను కేసీఆర్ జటిలం చేస్తున్నారని మండిపడ్డారు. అన్ని కోర్టులే చేస్తే.. నువ్వు కూర్చిలో కూర్చుని గాడిద పళ్లు తోముతున్నారా? అని ఎద్దేవా చేశారు. కోర్టులను సైతం సీఎం కేసీఆర్ తప్పుదోవ పట్టిస్తున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. అమరవీరులు, నిరుద్యోగులు, ఉద్యోగ సంఘాలు, కార్మిక సంఘాలు కేసీఆర్ పాలనలో మోసానికి, దోపిడీకి గురయ్యాయని అన్నారు. మలి తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టాలన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో నెలరోజులకుపైగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేశారని గుర్తు చేశారు.