నాపై కేసులు..ప్రభుత్వ పట్టాలే: వెనుకడుగే లేదన్న రేవంత్, కేసీఆర్, కేటీఆర్ రాజీనామాకు డిమాండ్
హైదరాబాద్: తెలంగాణ సర్కారుపై తన విమర్శల దాడిని కొనసాగిస్తున్నారు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి. ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధపడినప్పుడల్లా ఏవో ఆరోపణలతో తనపై కేసులు పెట్టడం పరిపాటిగా మారిపోయిందని కేసీఆర్ సర్కారుపై మండిపడ్డారు.

వెనుకంజ ప్రసక్తే లేదు..
తనపై ఎన్ని కేసులు పెట్టినా ప్రభుత్వంపై పోరాటంలో తాను వెనుకంజ వేసేది లేదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ‘పట్నం గోస' కార్యక్రమంోల భాగంగా హైదరాబాద్ నగర శివారులోని కుత్బుల్లాపూర్లో అసంపూర్తిగా ఉన్న రాజీవ్ స్వగృహ, డబుల్ బెడ్ రూం ఇళ్లను రేవంత్ రెడ్డి గురువారం పరిశీలించారు. ఆయన వెంట కూన శ్రీశైలంగౌడ్ కూడా ఉన్నారు.

కేసులు నాకు పట్టాల్లాంటివి..
అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. నిలిచిపోయిన రాజీవ్ స్వగృహ పనులను వెంటనే పూర్తి చేసి లబ్ధిదారులకు కేటాయించాలని డిమాండ్ చేశారు. గోపన్పల్లి భూ అక్రమాల ఆరోపణలపై స్పందిస్తూ.. తాను ప్రభుత్వంపై పోరాటానికి బయల్దేరినప్పుడల్లా అక్రమ కేసులు పెట్టడం టీఆర్ఎస్ సర్కారుకు అలవాటైపోయిందన్నారు. ఎన్ని కేసులు పెడితే తనకు అంత లాభమని అన్నారు.
కేసులు తనకు ప్రభుత్వం ఇచ్చే పట్టాల్లాంటివని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

కేసీఆర్, కేటీఆర్ రాజీనామా చేయాలి..
పనులు పూర్తి చేయకపతే ఉద్యోగులను డిస్మిస్ చేస్తానన్న కేసీఆర్, కేటీఆర్లు.. డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణ పనులు పూర్తి చేయకుండా వైఫల్యం చెందినందుకు రాజీనామా చేయాలని రేవంత్ డిమాండ్ చేశారు. పట్నంగోస కార్యక్రమాన్ని రద్దు చేసుకోవాలని చిల్లర వ్యవహారాలు చేస్తున్నారని సర్కారుపై మండిపడ్డారు.

ఆరేళ్ల వయస్సులో భూమి కొన్నానా?
తాజాగా కేసుపై రేవంత్ రెడ్డి బుధవారం స్పందిస్తూ.. గోపన్పల్లిలో 1978లో రికార్డులు తారుమారు చేసి భూమికొన్నట్లు ఆరోపిస్తున్నారని, అప్పుడు తన వయసు ఆరేళ్లని.. గోపన్పల్లి ఎక్కడ ఉందో కూడా తెలియదని చెప్పుకొచ్చారు. ఆస్తులను లిటిగేషన్లో పెడితే రేవంత్ లొంగుతాడని భావిస్తున్నారని, తన ఆస్తులన్నీ పోయినా.. చివరి శ్వాస వరకు కేసీఆర్పై పోరాడతానన్నారు. కాగా, గోపన్పల్లిలోని సర్వే నెంబర్ 127లో కట్టడాలను రేవంత్ రెడ్డి, ఆయన అనుచరులు దౌర్జన్యంగా కూల్చివేశారంటూ బాధితులు ఫిర్యాదు చేశారు. 2016లో నమోదైన ఈ కేసులో రేవంత్ రెడ్డిపై గచ్చిబౌలి పోలీసులు ఛార్జీషీటు దాఖలు చేశారు. ఈ ల్యాండ్ కేసులో రేవంత్ రెడ్డి ప్రమేయం ఉందని తేల్చారు. రేవంత్ రెడ్డితోపాటు ఆయన సోదరుడు కొండల్ రెడ్డి, లక్ష్మయ్య పేర్లను కూడా ఛార్జీషీటులో చేర్చారు.












Click it and Unblock the Notifications