తెలంగాణలో రాహుల్ యాత్ర.. రేపు డీజీపీ వద్దకు రేవంత్ బృందం
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. కన్యాకుమారి నుంచి మొదలైన యాత్ర కశ్మీర్ వరకు సాగనుంది. ఇప్పటికే తమిళనాడు, కేరళలో ముగియగా.. ఇప్పుడు కర్ణాటకలో కొనసాగుతోంది. నెక్ట్స్ తెలంగాణ రాష్ట్రంలో అడుగిడనుంది. ఇందుకు సంబంధించి టీ పీసీసీ తగిన ఏర్పాట్లు చేస్తోంది.
కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర పాదయాత్ర శుక్రవారం కేరళ నుంచి కర్ణాటకలోకి అడుగు పెట్టింది. కర్ణాటకలో యాత్రను ముగిసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ మీదుగా రాహుల్ యాత్ర తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. అక్టోబర్ 24వ తేదీన యాత్ర తెలంగాణలోకి అడుగుపెట్టనుంది.
రాహుల్ పాదయాత్రపై కీలక నేతలతో టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. తెలంగాణలో రాహుల్ గాంధీ పాదయాత్రను దిగ్విజయం చేయాలని రేవంత్ రెడ్డి చెప్పారు. ఇందుకోసం సబ్ కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీలకు పార్టీ సీనియర్లను ఇంచార్జీలుగా నియమిస్తామని తెలిపారు. ఇక తెలంగాణలో రాహుల్ పాదయాత్రకు అనుమతి కోసం శనివారం డీజీపీని కలవనున్నట్లు రేవంత్ తెలిపారు.
రాహుల్ పాదయాత్ర కొనసాగుతుండగా విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆయన ధరించిన టీ షర్ట్ ధరపై ఇష్యూ జరిగింది. తర్వాత కాంగ్రెస్ శ్రేణులు మోడీ సూట్ గురించి ప్రస్తావించడంతో.. ఇరువర్గాలు శాంతియుతంగా ఉన్నారు.