హైదరాబాద్లో గన్ కల్చర్: కూకట్పల్లిలో పట్టపగలు కాల్పులు: ఏటీఎం సెక్యూరిటీ గార్డు సహా
హైదరాబాద్: హైదరాబాద్లో గన్కల్చర్ క్రమంగా వేళ్లూనుకుంటోన్నట్లు కనిపిస్తోంది. తరచూ పబ్బుల్లో కనిపించే తుపాకీ సంస్కృతి ఇప్పుడు నడిరోడ్డు మీదికొచ్చినట్టుంది. పట్టపగలు కూకట్పల్లిలో చోటు చేసుకున్నకాల్పులు కలకలం రేపుతున్నాయి. ఓ ఏటీఎం సెంటర్ వద్ద గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు గాయపడ్డారు. వారికి హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అత్యవసర వైద్య చికిత్సను అందజేస్తున్నారు. కాల్పుల్లో గాయపడిన అలీ అనే సెక్యూరిటీ గార్డు మరణించినట్లు సమాచారం అందింది. పోలీసులు దీన్ని ధృవీకరించాల్సి ఉంది.
కూకట్పల్లిలోని పటేల్కుంట పార్క్ సమీపంలో గల హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఏటీఎం కేంద్రం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఏటీఎం మిషన్లో డబ్బులు నింపుతోన్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులకు తెగబడ్డారు. సెక్యూరిటీ గార్డుతో పాటు ఏటీఎం సిబ్బందిపై కాల్పులు జరిపారు. డబ్బును దోచుకెళ్లారు. ఈ కాల్పుల్లో వారిద్దరికీ బుల్లెట్ గాయాలయ్యాయి. వారిని హుటాహుటిన సమీప ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, క్లూస్ టీమ్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేశారు.
Recommended Video
దోపిడీకి పాల్పడిన ముఠా కోసం గాలింపు చర్యలు చేపట్టారు. క్లూస్ టీమ్ సిబ్బంది అక్కడి శాంపిళ్లను సేకరించార. ఏటీఎం సెంటర్ సహా చుట్టుపక్కల అమర్చిన సీీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. పట్టపగలు రద్దీగా ఉండే కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో ఈ ఘటన చోటు చేసుకోవడం సంచలనంగా మారింది. గుర్తు తెలియని వ్యక్తులు పథకం ప్రకారమే ఈ దోపిడీకి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఏటీఎం కేంద్రానికి డబ్బులను తీసుకుని వచ్చే వ్యాన్ను ఎవరైనా అనుసరించారా? అనే విషయంపై ఆరా తీస్తున్నారు.
హైదరాబాద్లో గన్ కల్చర్: కూకట్పల్లిలో పట్టపగలు కాల్పులు: ఏటీఎం సెక్యూరిటీ గార్డు సహా#Telangana #Hyderabad #Kukatpally pic.twitter.com/tXGgtTdmm4
— oneindiatelugu (@oneindiatelugu) April 29, 2021
సమాచారం అందిన వెంటనే సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మొత్తం అయిదు లక్షల రూపాయల మేర నగదు దోపిడీకి గురైనట్లు తెలిపారు. సంఘటనా స్థలం నుంచి రెండు బుల్లెట్లు, బుల్లెట్ లాక్, హెల్మెట్ను సేకరించామని అన్నారు. గుర్తు తెలియని వ్యక్తులు పక్కా పథకం ప్రకారం రెక్కీ నిర్వహించి మరీ దోపిడీకి పాల్పడినట్లు అనుమానిస్తున్నామని చెప్పారు. వారిని గుర్తించడానికి చెక్పోస్టుల వద్ద పోలీసులను అప్రమత్తం చేశామని, నగర, నగర శివార్లలో విస్తృత గాలింపు చర్యలను చేపట్టినట్లు సజ్జనార్ స్పష్టం చేశారు. త్వరలోనే వారిని అరెస్ట్ చేస్తామని చెప్పారు.