దసరా పండుగ వేళ.. స్పెషల్ బస్సులు, ప్రత్యేక రైళ్లు
హైదరాబాద్ : దసరా పండుగ రానే వచ్చింది. ఆ క్రమంలో విద్యా సంస్థలకు సెలవులు కూడా ప్రకటించేశారు. ఈ నెల 29వ తేదీ నుంచి అక్టోబర్ 13వ తేదీ వరకు హాలీడేస్ ఇచ్చేశారు. దాంతో సొంత గ్రామాలకు వెళ్లేందుకు నగర వాసులు రెడీ అవుతున్నారు. అయితే పండుగ సీజన్లో రద్దీ దృష్ట్యా ప్రతిసారి బస్స్టాండ్, రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతుంటాయి. ఈసారి ప్రయాణీకులకు ఇబ్బందులు కలగకుండా ఇటు ఆర్టీసీ, అటు రైల్వే అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. స్పెషల్ బస్సులు, రైళ్లు అదనంగా నడుపుతున్నారు.

వరుస పండుగలు.. సెలవుల రద్దీ.. ప్రత్యేక సర్వీసులు
దసరా పండుగ నేపథ్యంలో ఇటు ఆర్టీసీ, అటు రైల్వే అధికారులు అలర్టయ్యారు. ప్రయాణీకులకు ఇబ్బందులు తలెత్తకుండా స్పెషల్ సర్వీసులు నడిపిస్తున్నారు. హైదరాబాద్ ఎంజీబీఎస్తో పాటు సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టేషన్ నుంచి స్పెషల్ బస్సులు నడిపుతున్నారు ఆర్టీసీ అధికారులు. అంతేకాదు నగరంలోని పలు ప్రాంతాల నుంచి ప్రత్యేక సర్వీసులు నడిపిస్తున్నారు. తెలంగాణలోని పలు ప్రాంతాలతో పాటు పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రకు కూడా స్పెషల్ బస్సులు అలాట్ చేశారు. అటు రైల్వే అధికారులు కూడా పెద్ద సంఖ్యలో ప్రత్యేక సర్వీసులు నడపుతున్నారు.

ఆర్టీసీ పకడ్బందీ ప్రణాళిక
దసరా పండుగ కోసం తెలంగాణ ఆర్టీసీ పకడ్బందీ ప్రణాళిక సిద్దం చేసింది. హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు 5 వేల బస్సులను నడిపేందుకు సన్నద్ధమయ్యారు అధికారులు. గత ఏడాది 4 వేల బస్సులను నడిపిన ఆర్టీసీ ఈసారి ఆ సంఖ్యను మరింత పెంచడం విశేషం. తెలంగాణలోని అన్ని ప్రాంతాలతో పాటు ఏపీ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, చత్తీస్ గఢ్ తదితర రాష్ట్రాలకు కూడా రెగ్యులర్ సర్వీసులతో పాటు అదనపు బస్సులు నడుపుతున్నారు.

నగరం నలుమూలల నుంచి స్పెషల్ బస్సులు
దసరా పండుగ పురస్కరించుకుని ఈ నెల 24వ తేదీ నుంచే ఆర్టీసీ బస్సుల సంఖ్య పెంచినప్పటికీ.. పండుగ సమీపించే తరుణానికి అక్టోబర్ 4వ తేదీ నుంచి అదనపు బస్సుల సంఖ్య మరింత పెంచనున్నారు. ఎంజీబీఎస్, జూబ్లీ బస్ స్టేషన్, దిల్సుఖ్ నగర్, అమీర్పేట్, కేపీహెచ్బీ, ఈసీఐల్, ఉప్పల్ తదితర ప్రాంతాల నుంచి కూడా స్పెషల్ బస్సులు నడుపనున్నారు. ముఖ్యంగా అక్టోబర్ 4 నుంచి 7 వరకు ప్రయాణీకుల సౌకర్యార్థం అడ్వాన్స్ రిజర్వేషన్ సౌకర్యం కల్పించారు. www. tsrtconline.in వెబ్సైట్లో టికెట్లు బుక్ చేసుకోవచ్చు.. లేదంటే అధీకృత ఏజెంట్ల నుంచి కూడా టికెట్లు కొనుగోలు చేయొచ్చని సూచిస్తున్నారు ఆర్టీసీ అధికారులు.

ఈ ఫోన్ నెంబర్ల ద్వారా మరింత సమాచారం
ఎంజీబీఎస్ బస్ స్టేషన్ నుంచి బయలుదేరే ఆర్టీసీ బస్సు సర్వీసుల కొరకు ఈ ఫోన్ నెంబర్లలో 8330933419, 8330933537, 8330933532 సంప్రదించవచ్చు. అలాగే జూబ్లీ బస్ స్టేషన్ నుంచి బయలుదేరే బస్సుల కోసం 040 - 27802203 నెంబర్లో కాంటాక్ట్ చేయొచ్చు. దిల్సుఖ్నగర్ 040 - 23747297, అమీర్పేట్ 9949958758, కేపీహెచ్బీ 9490484232 నెంబర్ల ద్వారా బస్సుల వివరాలు పొందొచ్చు.

రైల్వే శాఖ అలర్ట్.. 668 స్పెషల్ ట్రైన్లు
ఇక రైల్వే అధికారులు కూడా ప్రయాణీకులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. హైదరాబాద్ నుంచి తెలంగాణ, ఏపీతో పాటు ఇతర రాష్ట్రాలకు కూడా ప్రత్యేక రైళ్లు నడపనున్నారు. ఈ నెల 15 నుంచి వచ్చే నెల 31 వరకు 668 స్పెషల్ ట్రైన్లు నడిపేందుకు సిద్ధమయ్యారు. గతేడాది 381 రైళ్లు మాత్రమే నడిపిన రైల్వే శాఖ ఈసారి మాత్రం అదనపు సర్వీసుల సంఖ్య భారీగా పెంచింది. దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో అదనంగా 287 అదనపు రైళ్లను ప్రకటించింది.

మొబైల్ యాప్ ద్వారా టికెట్ బుకింగ్
ప్రయాణంలో అసౌకర్యం కలగకుండా అదనపు టికెట్ కౌంటర్లు కూడా ఏర్పాటు చేశారు రైల్వే అధికారులు. ప్రయాణీకులు లైనులో నిలబడి ఇబ్బందులు పడకుండా ప్రత్యేకంగా UTS అనే మొబైల్ యాప్ను తెరపైకి తెచ్చింది. దీని ద్వారా కూడా ప్రయాణీకులు టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ప్రత్యేక రైళ్ల సమాచారం కోసం అన్నీ స్టేషన్లలో ప్రత్యేకంగా అనౌన్స్మెంట్ సిస్టం ఏర్పాటు చేశారు. డిమాండ్ మేరకు అవసరమైనంత స్పెషల్ ట్రైన్లను నడిపించనున్నారు. వీటికోసం ఐఆర్సీటీసీ ద్వారా కూడా టికెట్లు బుక్ చేసుకోవచ్చు.












Click it and Unblock the Notifications