మేడారం జాతరకు బస్సులో ఆర్టీసీ చైర్మన్.. నిధులు విడుదల చేసిన కేంద్రం..
వన దేవతలు సమ్మక్క సారాలమ్మను దర్శించుకునేందుకు భక్తులు తరలి వెళుతున్నారు. ప్రముఖులు కూడా వస్తున్నారు. టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్.. బస్సులో తిరుగుతున్నారు. ఇప్పుడు ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ వంతు వచ్చింది. ఆయన సమ్మక్క- సారక్క జాతరకు బస్సులో బయల్దేరారు. హైదరాబాద్ నుంచి కుటుంబ సభ్యులతో కలిసి బస్సులో టికెట్ తీసుకున్నారు. ఆర్టీసీ చైర్మన్ వెంట సతీమణి వినోద, ధర్పల్లి జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్, ఐడీసీఎంఎస్ చైర్మన్ సంబారి మోహన్ ఉన్నారు.
ఇటు మేడారం జాతరకు కేంద్ర ప్రభుత్వం కూడా నిధులను మంజూరు చేసింది. జాతర నిర్వహణకు కేంద్ర గిరిజన వ్యవహారాలశాఖ, పర్యా టక మంత్రిత్వ శాఖ రు.2.5 కోట్ల నిధులను విడుదల చేసింది. గిరిజన సాంస్కృతిక, వారసత్వాన్ని ప్రోత్సహించడంలో కేంద్ర ప్రభుత్వ పాత్రను కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖల మంత్రి కిషన్ రెడ్డి వివరించారు.
మేడారం చిలకల గుట్ట చుట్టూ సంప్రదాయ రీతిలో 500 మీటర్ల కాంపౌండ్ గోడను నిర్మిస్తారు. అనుసంధానంగా 900 మీటర్ల మెష్ను ఏర్పాటుకు, గోడల మీద గిరిజన సంస్కృతిని ప్రతిబింబించేలా అధ్భుతమైన చిత్రాలను వేస్తారు. గిరిజన మ్యూజియంలో డిజిటల్ సమాచార కేంద్రాలు ఏర్పాటు, గిరిజన మ్యూజియం పరిసరాలలో కోయ గ్రామాన్ని ప్రతిబింబించేలా నిర్మాణాలు చేపట్టడానికి వినియోగిస్తామన్నారని మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.
ఈ నెల 16న సమ్మక్క సారాలమ్మ అతిపెద్ద గిరిజన జాతర ప్రారంభం అవుతుంది. తెలంగాణలో గిరిజనులు అత్యధిక సంఖ్యలో నివసించే ములుగు జిల్లాలోని మేడారం గ్రామంలో ఈ నెల 16 నుంచి 19వ తేదీ వరకు జరుగనుంది. సమ్మక్క-సారలమ్మ మహా జాతర కోసం మేడారంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.