TSRTC Strike: కార్మికులను విధుల్లోకి తీసుకునేది లేదు: ఆర్టీసీ ఎండీ హెచ్చరిక
హైదరాబాద్: ఆర్టీసీ జేఏసీకి తెలంగాణ ఆర్టీసీ ఇంఛార్జ్ ఎండీ సునీల్ శర్మ షాకిచ్చారు. తాము సమ్మె విరమించి మంగళవారం నుంచి విధుల్లో చేరతామని ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్థామ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. కార్మికులంతా మంగళవారం ఉదయం నుంచి డిపోల వద్దకు చేరి విధుల్లో చేరాలని అశ్వత్థామ రెడ్డి సూచించారు.

విధుల్లోకి తీసుకునేది లేదు..
ఈ నేపథ్యంలో ఆర్టీసీ ఇంఛార్జ్ ఎండీ సునీల్ శర్మ ఓ ప్రకటన విడుదల చేశారు. ఆర్టీసీ కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకునేది లేదని తేల్చి చెప్పారు. సమ్మె విషయంలో ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ప్రకటన హాస్యాస్పదమని అన్నారు. ఇష్టమొచ్చినప్పుడు సమ్మెకు వెళతాం.. ఇష్టం మొచ్చినప్పుడు విధుల్లో చేరతామంటే కుదరని ఆయన వ్యాఖ్యానించారు.

ప్రజలను ఇబ్బంది పెట్టారు..
ఇష్టానుసారంగా చేస్తామంటే ప్రభుత్వ రంగ సంస్థల్లో సాధ్యం కాదని సునీల్ శర్మ అన్నారు. బతుకమ్మ, దసరా, దీపావళి లాంటి ముఖ్యమైన పండగల సందర్భంగా అనాలోచిత సమ్మెకు దిగి ప్రజలకు తీవ్రమైన అసౌకర్యం కలిగించారని అన్నారు. కార్మికులు ఇప్పుడు చట్ట విరుద్ధమైన సమ్మెలో ఉన్నారని వ్యాఖ్యానించారు.

అప్పటి వరకు సంయమనం పాటించాలి..
హైకోర్టు చెప్పిన దాని ప్రకారం ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె విషయంలో కార్మిక శాఖ కమిషనర్ తగు నిర్ణయం తీసుకుంటారన్నారు. దాన్ని బట్టే ఆర్టీసీ యాజమాన్యం తదుపరి చర్యలు ఉంటాయని చెప్పారు. అంతా చట్టబద్ధంగా, పద్ధతి ప్రకారం జరుగుతుందన్నారు. అప్పటిక వరకు కార్మికులందరూ సంయమనం పాటించాలని సునీల్ శర్మ చెప్పారు.

మీ ఇష్ట ప్రకారం కుదరదు..
అంతేగాక, హైకోర్టు చెప్పిన ప్రక్రియ ముగిసే వరకు చట్ట విరుద్ధమైన సమ్మెలో ఉన్న కార్మికులను విధుల్లో చేర్చుకోవడం సాధ్యం కాదని సునీల్ శర్మ చెప్పారు. తమంతట తాముగా సమ్మెకు దిగి, ఇప్పుడు మళ్లీ విధుల్లోకి చేరడం చట్ట ప్రకారం కుదరదన్నారు. కార్మికులు ఇప్పటికే యూనియన్ల మాట విని నష్టపోయారని, ఇక ముందు కూడా యూనియన్ల మాట విని మరిన్ని నష్టాలు కోరి తెచ్చుకోవద్దని హెచ్చరించారు.

అడ్డుకుంటే చర్యలు తప్పవంటూ హెచ్చరిక
రేపు(మంగళవారం) డిపోల వద్దకు వెళ్లి శాంతి భద్రతల సమస్యలు సృష్టించవద్దని, అలా చేస్తే చర్యలు తప్పవని సునీల్ శర్మ హెచ్చరించారు. బస్సులు నడుపుతున్న తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లు అడ్డుకోవద్దని స్పస్టం చేశారు. అన్ని డిపోల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, పరిస్థితిని సమీక్షించడం జరుగుతుందన్నారు.

కేసీఆర్ను కలిసేందుకు..
హైకోర్టు సూచించిన ప్రక్రియ ప్రకారం కార్మిక శాఖ కమిషనర్ నిర్ణయం తీసుకునే వరకు సంయమనం పాటించాలని కోరుతున్నామని ఆర్టీసీ ఇంఛార్జ్ ఎండీ సునీల్ శర్మ వెల్లడించారు. అంతకుముందు సీఎం కేసీఆర్ను కలిసేందుకు సునీల్ శర్మ ప్రగతిభవన్ వెళ్లారు. ఆ తర్వాత ఆయన ఈ ప్రకటన చేశారు.












Click it and Unblock the Notifications