అయ్యాయ్యో వద్దమ్మా.. ఇప్పుడు ఆర్టీసీ వంతు, వీడియో.. షేర్ చేసిన సజ్జనార్
ఇప్పుడు సుఖీభవ ట్రెండ్ నడుస్తోంది. ఓ యాడ్ అలా ట్రెండ్ సెట్టర్గా నిలిచింది. ఆ తర్వాత డ్యాన్సర్ సుఖీభవ అంటూ మరింత హైప్ తీసుకొచ్చాడు. ఇక ఇప్పుడు ఆర్టీసీ వంతు వచ్చింది. అసలే దసరా.. దానికి అనుగుణంగా వచ్చిన వీడియో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. సజ్జనార్ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి తనదైన శైలిలో పనులు చేస్తున్నారు. ప్రయాణికులను ఆర్టీసీవైపు ఆకర్షించేలా చర్యలు తీసుకుంటున్నారు. బస్సులో సామాన్య ప్రయాణికునిలా ప్రయాణించి.. ప్రయాణికుల సమస్యలు తెలుసుకుంటున్నారు.
భరోసా..
ఆర్టీసీ సంస్థను ఆర్ధికంగా బలపరిచేందుకు అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేసి.. సరికొత్త విధానాలకు రూపకల్పన చేస్తున్నారు. ఆర్టీసీ ప్రయాణంపై ప్రజల్లో భరోసా కల్పించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. గణేష్ నిమజ్జనానికి ఆయన కుటుంబంతో కలిసి ఆర్టీసీ బస్సులో ప్రయాణించి అందరి దృష్టిని ఆకర్షించారు. పండుగ సమయంలో ప్రయాణికులు ఆర్టీసీ బస్సులు ఎక్కేలా మోటివేట్ చేస్తున్నారు. ఆర్టీసీ ప్రయాణం సురక్షితం అని రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. ఇక దసరా పండుగ కావడంతో ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసి సామాన్య ప్రయాణికులకు ఇబ్బంది కలుగకుండా చూస్తున్నారు. ప్రయాణికుల్లో గందరగోళం ఏర్పడకుండా బస్సులు ఏఏ ప్రాంతాల గుండా వెళ్తుందో వివరంగా చెబుతున్నారు.
కీలక ప్రకటన
టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రకటన చేశారు. ప్రయాణికుల సౌకర్యం, భద్రతే ధ్యేయంగా పండుగ సమయంలో ఎటువంటి అదనపు చార్జీలు లేకుండా ఆర్టీసీ సేవలందిస్తుందని పేర్కొన్నారు. ప్రయాణికులను ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేలా చేసేందుకు సజ్జనార్ సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నారు. 'అయ్యయ్యో వద్దమ్మా సుఖీభవ సుఖీభవ' అంటూ ఇటీవల సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన డైలాగ్తో ప్రయాణికులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను సజ్జనార్ ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశారు.
Recommended Video
అయ్యాయ్యో వద్దమ్మా
వీడియోలో ఓ వ్యక్తి సూటుకేసు తీసుకోని ఊరు వెళ్లేందుకు బయలుదేరుతాడు. అతడు రోడ్డు మీద ఉన్న వ్యక్తితో తాను జీప్లో ఊరికి వెళ్తున్నట్టుగా చెప్తాడు. అప్పుడు వెంటనే అక్కడున్న ఓ గ్యాంగ్ 'పక్కనే ఆర్టీసీ బస్సు ఉంది క్షేమంగా వెళ్లొచ్చు డబ్బులు ఎక్కువ తీసుకోరు గానీ సుఖీభవ, సుఖీభవ'అని అంటాడు. ఆ తర్వాత డ్యాన్స్ చేయడం మొదలుపెడతారు. ఈ వీడియోను పోస్ట్ చేసిన సజ్జనార్ 'అయ్యయ్యో వద్దమ్మా కానీ.. సుఖీభవ సుఖీభవ నమ్మకానికి భరోసా మన టీఎస్ ఆర్టీసీ.. RTC బస్సులో ప్రయాణం సురక్షితం, సుఖమయం, శుభప్రదం'అని పేర్కొన్నారు. ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.