ఆర్టీసీ కార్మికుల సమ్మెకు జనసేన మద్దతు .. ఉద్యోగుల తొలగింపు కరెక్ట్ కాదన్న పవన్
ఆర్టీసీ కార్మికులను ఉద్యోగాల నుండి తొలగించాలనే నిర్ణయాన్ని తప్పు పడుతూ ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు ఆర్టీసీ కార్మికులకు తమ మద్దతు తెలుపుతున్నాయి. తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మెపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ఆర్టీసీ కార్మికులు డిమాండ్ల సాధనకు సమ్మె చేస్తుంటే సీఎం కేసీఆర్ కఠినంగా వ్యవహరించడం సమంజసం కాదన్నారు. ఉద్యోగులు చేసే ఆందోళనలను సానుభూతితో పరిశీలించాలే తప్ప కఠినమైన నిర్ణయాలు తీసుకోవద్దని ప్రభుత్వానికి ఆయన సూచించారు. సకల జనుల సమ్మెలో భాగంగా 17 రోజుల పాటు ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె చేసి ఉద్యమానికి అండగా ఉన్నారని గుర్తుచేసిన పవన్ కళ్యాణ్ చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు.
ఆర్టీసీ సమ్మెపై సాయంత్రం 4 గంటలకు మరోసారి సమీక్ష జరపనున్న సీఎం కేసీఆర్..
తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె సందర్భంగా దాదాపు 48 వేల మంది ఉద్యోగులను ఉద్యోగాల నుండి తొలగిస్తున్నట్టు వస్తున్న వార్తలు తనను కలవరానికి గురి చేస్తున్నాయని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అటు ప్రభుత్వం ఇటు ఉద్యోగ సంఘాల నేతలు సంయమనం పాటించి సమస్యను సానుకూలంగా పరిష్కరించుకోవాలని ఉభయులకు విజ్ఞప్తి చేస్తున్నానని జనసేన పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ప్రజలకు నష్టం కలుగకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్న పవన్ కళ్యాణ్ ఉద్యోగుల పట్ల ప్రభుత్వం ఉదారత చూపించాలని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ను ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉద్దేశాన్ని అర్థం చేసుకొని సామరస్యంగా సమస్యలు పరిష్కరించాలని జనసేన పవన్ కళ్యాణ్ ని కోరారు. త్యాగాల పునాదుల మీద నిర్మించిన తెలంగాణ రాష్ట్రంలో కార్మికులు చేసిన త్యాగాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలని చెప్పారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె, సమ్మెలో పాల్గొన్న ఉద్యోగులను తొలగించాలని వారి పట్ల ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆందోళనకరమని పేర్కొన్న పవన్ కళ్యాణ్ చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు.
తమ డిమాండ్ల సాధన కోసం మూడు రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టిన సంగాహి తెలిసిందే . పండుగ సమయాల్లో ప్రజలకు ఇబ్బందులు కలిగించవద్దని, విధుల్లో చేరి తీరాలని తెలంగాణ సర్కారు హుకుం జారీచేసినా లెక్క చెయ్యకుండా సమ్మె కొనసాగించారు. ఒకవేళ సమ్మె చేస్తే ఎస్మా ప్రయోగిస్తామని, ఉద్యోగాల నుండి తొలగిస్తామని సీఎం కేసీఆర్ తమ ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రకటించారు. అయినా ప్రభుత్వ నిర్ణయాన్ని బేఖాతరు చేస్తూ ఆర్టీసీ కార్మికుల సమ్మె చేయడాన్ని సీరియస్ గా తీసుకున్న గులాబీ బాస్ చివరికి అనుకున్నదే చేశారు. ఐదో తేదీ సాయంత్రం 6 గంటలకు విధులకు హాజరు కాని వారందరినీ ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో తీవ్ర వ్యతిరేఖత వ్యక్తం అవుతుంది.