రేప్ కేసు ఘటన: స్కూల్ ప్రిన్సిపాల్ మాధవి అరెస్ట్
బంజారాహిల్స్ లో గల డీఏవీ పబ్లిక్ స్కూల్ లో జరిగిన దారుణం పెను దుమారం రేపింది. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇప్పటికే నిందితుడు రజనీకుమార్ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఇప్పుడు స్కూల్ ప్రిన్సిపాల్ మాధవిని కూడా అరెస్ట్ చేశారు. ఎల్ కేజీ బాలికపై స్కూల్ ప్రిన్సిపాల్ కారు డ్రైవర్ రజనీకుమార్ రెండు నెలలుగా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. నిందితుడిపై పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
నిందితుడిని కాపాడేందుకు ప్రిన్సిపాల్ మాధవి ప్రయత్నిస్తున్నారని బాలిక తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. నాలుగేన్నరేళ్ల చిన్నారిపై లైంగిక దాడి ఘటనపై స్కూల్ ప్రిన్సిపాల్ మాధవికి సమాచారం తెలుపగా, ఆమె నిర్లక్ష్యంగా తల్లిదండ్రులకు సమాధానం ఇచ్చారు. ఈ వాట్సాప్ చాటింగ్ బయటకు వచ్చింది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు ప్రిన్సిపాల్ మాధవిపై కేసు నమోదు చేశారు. బాలిక తండ్రి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు.
ప్రిన్సిపాల్ స్కూల్ డ్రైవర్ రజనీకుమార్ రెండు నెలలుగా బాలిక పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నాడు. సోమవారం మరింత బరి తెగించాడు. ప్రిన్సిపాల్ మాధవి రూమ్ ఎదురుగా ఉన్న ల్యాబ్ లో బాలికపై అత్యాచారం చేశాడు. విషయం ఎవరికీ చెప్పొద్దని బాలికను బెదిరించాడు. నీరసంగా ఉన్న బాలికను తల్లి పదే పదే ప్రశ్నించడంతో అత్యాచారం గురించి తల్లితో చెప్పింది. వెంటనే తల్లిదండ్రులు బాలికను స్కూల్ కి తీసుకెళ్లగా.. నిందితుడిని గుర్తించింది. అనంతరం బాలిక తల్లిదండ్రులు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు బాలికను భరోసా కేంద్రానికి తరలించి కౌన్సిలింగ్ ఇప్పించారు. అనంతరం ఇంటికి పంపారు.
రెండు నెలలుగా బాలిక ప్రవర్తన ద్వారా డిప్రెషన్ లోకి వెళ్లినట్టు ఉందని బాలిక తల్లిదండ్రులు వాపోయారు. గతంలో సఫిల్ గూడ బ్రాంచ్ లో రజనీకుమార్ పని చేశాడు. అక్కడ కూడా నిందితుడు చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.