ఫీజుల కోసమే స్కూల్స్ ఓపెన్.. వసూల్ చేశాక క్లోజ్, దాసోజు శ్రావణ్ ఫైర్
సీఎం కేసీఆర్పై కాంగ్రెస్ నేత దాసోజు శ్రావణ్ ఆగ్రహాం వ్యక్తం చేశారు. కరోనా వైరస్ కట్టడిపై సోయిలేకుండా ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు 9 లక్షల నలభై వేల మందికి మాత్రమే వ్యాక్సిన్ ఇచ్చారని చెప్పారు. ఫ్రంట్ లైన్ వారియర్స్కు కూడా పూర్తి స్థాయిలో వ్యాక్సిన్ ఇవ్వలేదన్నారు. ప్రజలందరికీ వ్యాక్సిన్ ఇవ్వడానికి ఇంకెన్ని రోజులు కావాలని అడిగారు.
సీఎం కేసీఆర్కు ఎన్నికల మీద ఉన్న ధ్యాస ప్రజల ఆరోగ్యం మీద లేదని చెప్పారు. రాజస్థాన్, మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో 47 లక్షల మందికి వ్యాక్సిన్ ఇచ్చారని తెలిపారు. వ్యాక్సిన్ ఇవ్వడంలో మన రాష్ట్రం ఎందుకు వెనుక బడిందని దాసోజు శ్రావణ్ ప్రశ్నించారు. అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్లో వ్యాక్సిన్ అందుబాటులో ఉంచాలని సూచించారు.
రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించాలని శ్రావణ్ సూచించారు. ఫీజుల వసూల్ కోసమే స్కూల్స్ ఓపెన్ చేశారు తప్ప మరో అంశం లేదన్నారు. నెలన్నర తర్వాత స్కూల్స్ మూసి వేశారని పేర్కొన్నారు. బార్లు, థియేటర్లు, మాల్స్ క్లోజ్ చేయొద్దా అని అడిగారు. ఇవీ చేయరు కానీ కరోనా వైరస్ ఎలా కట్టడి అవుతుందని తెలిపారు.
కరోనా వైరస్ ఉధృతి పెరుగుతోంది. దీంతో స్కూల్స్/ కాలేజీలు ఇవాళ్టి నుంచి తాత్కాలికంగా మూసివేశారు. దీనికి సంబంధించి నిన్న అసెంబ్లీలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటన కూడా చేశారు. తర్వాత సీఎస్ నోట్ కూడా విడుదల చేశారు. అన్నీ తరగతులు ఆన్ లైన్లో మాత్రం కొనసాగుతాయని స్పస్టంచేశారు. దీనిపై దాసోజు శ్రావణ్ స్పందించారు. కేసీఆర్ కార్పొరేట్లకు తొత్తుగా మారారని విమర్శించారు.