సమ్మక్క వారసురాలు షర్మిల.. కంచె ఐలయ్య హాట్ కామెంట్స్
వైఎస్ షర్మిల రాజకీయ పార్టీ హాట్ టాపిక్గా మారుతోంది. ఒక్కొక్కరు ఆమెకు మద్దతు చెబుతున్నారు. ఆ పార్టీలోకి చేరే నేతల సంఖ్య కూడా పెరుగుతోంది. దీంతో తెలంగాణలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీగా మారబోతుందా అనే సందేహాలు వస్తున్నాయి. తాజాగా రచయిత కంచె ఐలయ్య కూడా షర్మిలకు మద్దతు తెలిపారు. దీనికి సంబంధించి హాట్ కామెంట్స్ కూడా చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 1.91 లక్షల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలనే డిమాండ్తో ధర్నాచౌక్లో వైఎస్ షర్మిల దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. దీనికి రచయిత కంచె ఐలయ్య మద్దతు పలికారు. కాకతీయ గడ్డ మీద రుద్రమ దేవి తర్వాత మళ్లీ షర్మిలను చూస్తున్నానంటూ ఉద్వేగానికి గురయ్యారు. కంచె ఐలయ్య కామెంట్స్ చర్చకు దారితీశాయి. ఆయన ఇదివరకు కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. వైశ్య సామాజిక వర్గాన్ని కించపరుస్తూ.. కోమటోళ్లు సామాజిక స్మగ్లర్లు అనే పుస్తకం కూడా రాసిన సంగతి తెలిసిందే.
తెలంగాణ గడ్డపై రాజకీయ పార్టీ పెట్టే హక్కు ఒక్క షర్మిలకే ఉందని ఐలయ్య అన్నారు. సమ్మక్క - సారక్క వారసురాలు షర్మిల అని, తెలంగాణ మహిళలు షర్మిలను సీఎం చేస్తారని జోస్యం చెప్పారు. వైఎస్ఆర్ పాలనను ఐలయ్య గుర్తు చేసుకున్నారు.
వైఎస్ హయాంలో ఆరు వేల ఇంగ్లీష్ మీడియం స్కూళ్లను ప్రారంభించారని తెలిపారు. ఆనాటి స్కూల్స్ ఆదర్శంగా నిలిచాయని ఐలయ్య చెప్పారు. ఆ నాడు పేదల చదువుకు వైఎస్ఆర్ ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని వివరించారు. కానీ నేడు విద్య, వైద్యం ఒక వ్యాపారంగా మారిపోయిందని చెప్పారు.