4 రాష్ట్రాలకు నో.. తెలంగాణకు ప్రియార్టీ.. సోనియాగాంధీ టూర్ ఆసక్తికరం
Recommended Video

తెలంగాణ ఎన్నికల వేడి రాజుకుంటోంది. నువ్వా నేనా అనే రీతిలో ప్రచారం ఉధృతమవుతోంది. పోలింగ్ సమయం దగ్గరపడుతుండటంతో ప్రచారాన్ని స్పీడప్ చేస్తున్నారు ఆయా పార్టీల నేతలు. అందులోభాగంగా రాష్ట్రానికి వస్తున్నారు యూపీఏ ఛైర్పర్సన్ సోనియాగాంధీ. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారిగా సోనియాగాంధీ వస్తుండటంతో కాంగ్రెస్ శ్రేణులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అయితే తెలంగాణతో పాటు మరో 4 రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతున్న వేళ ఆయా రాష్ట్రాల్లో సోనియాగాంధీ పర్యటించకపోవడం, ఇక్కడికి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అంతేకాదు సోనియాతో పాటు రాహుల్ గాంధీ కూడా బహిరంగ సభలో పాల్గొంటుండటం మరో ప్రత్యేకత అంటున్నారు పార్టీ శ్రేణులు.
శుక్రవారం సాయంత్రం మేడ్చల్ లో జరగనున్న బహిరంగ సభలో సోనియాగాంధీ పాల్గొంటారు. సభ విజయవంతమయ్యేలా తలమునకలయ్యారు స్టేట్ కాంగ్రెస్ లీడర్స్. భారీ స్థాయిలో జన సమీకరణ చేయడమే గాకుండా సభ సక్సెస్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నట్లు టాక్.

తొలి సభ ఇదే.. పార్టీశ్రేణుల్లో ఉత్సాహం
అసెంబ్లీ ఎన్నికల ప్రకటన తర్వాత టికెట్ల పంపిణీలో బిజీబిజీగా ఉన్న కాంగ్రెస్ నేతలు బహిరంగ సభలు నిర్వహించలేదు. సోనియాగాంధీ పాల్గొంటున్నదే తొలి బహిరంగ సభ కావడం గమనార్హం. అందుకే ఈ సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు పార్టీ శ్రేణులు. దీనికోసం భారీగా జనాలను పోగు చేసేలా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. జన సమీకరణ కోసం ప్రత్యేక టీములను ఏర్పాటు చేసినట్లు సమాచారం.
పార్టీ అగ్రనేతలు పాల్గొంటున్న సభ కావడంతో వేదికను స్పెషల్ గా డిజైన్ చేశారు. తొలుత వరంగల్ లో సభ ఏర్పాటు చేయాలని భావించినా.. కొన్ని కారణాలరీత్యా మేడ్చల్ కు ఫిక్సయినట్లు సమాచారం. టీఆర్ఎస్ ను ఢీ కొట్టడమే లక్ష్యంగా మొదటినుంచి పావులు కదుపుతున్న కాంగ్రెస్ పెద్దలు స్ట్రాటజీలో భాగంగానే మేడ్చల్ ను ఎన్నుకున్నట్లు తెలుస్తోంది.

సోనియా, రాహుల్ ప్రసంగంపై ఆసక్తి
మేడ్చల్ బహిరంగ సభలో సోనియాగాంధీతో పాటు రాహుల్ కూడా పాల్గొంటున్నారు. దాదాపు 3 గంటల పాటు వీరి రాష్ట్ర పర్యటన ఉండనుంది. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. 5 గంటల 30 నిమిషాలకు రోడ్డుమార్గంలో మేడ్చల్ సభకు బయలుదేరి వెళతారు. సాయంత్రం 6 గంటల నుంచి దాదాపు గంటన్నర సేపు సభలో ఉంటారు. రాత్రి 8 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టు చేరుకుని ఢిల్లీకి వెళ్లిపోతారు. ముఖ్యంగా వీరిద్దరి ప్రసంగంపై పార్టీ శ్రేణులు భారీ ఆశలు పెట్టుకున్నాయి.

వ్యూహరచన..! ఒకే వేదికపై 119 మంది
మిత్రపక్షాల పొత్తుతో మహా కూటమి టికెట్ల పంచాయితీ ఎటూ తేలక చాలా ఆలస్యం జరిగింది. దీంతో ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ నేతలు వెనుకబడతారనే టాక్ వినిపించింది. అటు అభ్యర్థులు కూడా ఎవరికి టికెట్ వస్తుందో తెలియక మల్లగుల్లాలు పడ్డారు. ప్రచారం చేసుకోవాలో వద్దో తెలియని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడారు. అందుకే స్టేట్ కాంగ్రెస్ లీడర్లు కొత్తగా వ్యూహరచన చేశారు. ప్రచారానికి పెద్దగా సమయం లేకపోవడంతో సోనియాగాంధీ పాల్గొంటున్న సభను భారీగా చేయడానికి డిసైడ్ అయ్యారు. స్టేజీపై ముఖ్యలీడర్లతో పాటు మహాకూటమి తరపున పోటీచేస్తున్న 119 మంది అభ్యర్థులకు స్థానం కల్పించారు. ఒకే వేదికగా తమ అభ్యర్థులను ప్రజలకు పరిచయం చేయడమే గాకుండా సెన్సేషనల్ క్రియేట్ చేసినట్లవుతుందనేది వారి ఆలోచనగా కనిపిస్తోంది.
మహాకూటమిగా కాంగ్రెస్, తెదేపా, తెజస, సీపీఐ పోటీ చేస్తున్న నేపథ్యంలో కూటమి తరఫున బరిలో ఉన్న 119 మంది అభ్యర్థులు ఈ సభా వేదికపై ఉండేలా ఏర్పాట్లు చేశారు. వీరితోపాటు కూటమి పార్టీల అధ్యక్షులు లేదా ముఖ్యనేతలు కూడా సభావేదికపై ఉంటారని కాంగ్రెస్ నేతలు పేర్కొంటున్నారు. సుమారు రెండు వందలమంది కూర్చునేందుకు వీలుగా వేదికను సిద్ధంచేశారు.

వాళ్లు కూడా స్టేజీపైనే..!
సోనియా, రాహుల్ పాల్గొంటున్న భారీ బహిరంగ సభ వేదికపై మిత్రపక్షాల పెద్దలకు కూడా చోటు దొరికింది. టీటీడీపీ అధ్యక్షుడు రమణ, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి కూడా వేదికపైన కూర్చుంటారు. వీరితో పాటు ఎమ్మార్పీఎస్ ప్రెసిడెంట్ మంద కృష్ణమాదిగతో పాటు బీసీ సంక్షేమ సంఘం నేషనల్ ప్రెసిడెంట్ ఆర్.కృష్ణయ్య (మిర్యాలగూడ కాంగ్రెస్ అభ్యర్థి) సభలో పాల్గొంటున్నారు.












Click it and Unblock the Notifications