తప్పుడు సమాచారం, సభను బుల్డొజ్ చేస్తున్నారు: సెషన్పై రఘునందన్ రావు, శ్రీధర్ బాబు
ఆత్మ బలిదానాలకు విరుద్ధంగా గవర్నర్ ప్రసంగం ఉందని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు విమర్శించారు. ప్రభుత్వం దశా దిశ లేకుండా నడుస్తుందని మండిపడ్డారు. శ్రమ శక్తికి, మేధోసంపత్తికి విలువ లేకుండా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఫైరయ్యారు. ఉద్యమ ఆకాంక్ష కోసం తెలంగాణలో మరో ఉద్యమం రాజుకుంటుందని వివరించారు. ప్రాజెక్టులు పూర్తయినట్టు గవర్నర్చే తప్పుడు ప్రసంగం చేయించారని విమర్శించారు.
షాకింగ్: బీజేపీ ఎంపీ ఆత్మహత్య - ఢిల్లీలోని ఇంట్లో వేలాడుతూ హిమాచల్ నేత -పార్లమెంటరీ భేటీ వాయిదా
పరిహారంలో తేడా
రంగనాయక సాగర్, కొండపోచమ్మ సాగర్ భూ నిర్వాసితులకు అందిస్తున్న నష్ట పరిహారంలో వ్యత్యాసం దేనికని ప్రశ్నించారు. తక్షణం ఆర్ ఆండ్ ఆర్ ప్యాకేజి అందజేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఇప్పటి వరకు ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా లేదని రఘునందన్ రావు విమర్శించారు. కొత్త ఆసరా పించన్ లేదని, అప్పుల పరిధిని 3 నుంచి 3.5 శాతానికి కేంద్రం పెంచినా... రైతు రుణమాఫీని ఏక కాలంలో ఎందుకు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు.
పోలీసుల ఆంక్షలు
తమ ప్రాంతంలో పోలీసుల ఆంక్షలు విపరీతంగా ఉన్నాయని, 144 సెక్షన్ 24 గంటలు ఉంటుందన్నారు. శాంతిభద్రతలు సరిగా లేవని, వరంగల్లో నడి రోడ్డుపై పూజారిని హత్య చేసారన్నారు. బైంసాలో నాలుగేళ్ళ చిన్నారిపై అత్యాచారం జరిగిందని.. సీసీ టీవీలు.. కమాండ్ కంట్రోల్ రూమ్లు ఉన్నాయని అన్నారు. అవి అన్నీ ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. శాంతి భద్రతల కోసం మరిన్ని కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో ప్రశ్నించే గొంతులను హత్యలు చేస్తున్నారని, అందుకు న్యాయవాద దంపతుల హత్యే దీనికి ఉదాహరణగా రఘునందన్ రావు పేర్కొన్నారు.
మందబలం
మంద బలంతో అసెంబ్లీ సమావేశాలను బుల్డోజ్ చేస్తున్నారని సీఎం కేసీఆర్ను కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్బాబు విమర్శించారు. సంఖ్యా బలంతో సభను సీఎం ఏకపక్షంగా నడిపిస్తున్నారని శ్రీధర్బాబు ఆరోపించారు. ముఖ్యమంత్రి, మంత్రులకు ప్రజా సమస్యలు వినే ఓపిక లేకపోవటం బాధాకరమని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి తన తీరును మార్చుకోవాలని ఆయన హితవు పలికారు.
ఆరు రోజులా..?
45 రోజులు జరగాల్సిన సమావేశాలను ఆరు రోజులకు కుదించటం సరైంది కాదని ఆయన పేర్కొన్నారు. రైతులు, నిరుద్యోగులు, లా అండ్ ఆర్డర్ సమస్యలపై సభలో ప్రతిపక్షాలు మాట్లాడితే సీఎంకు నచ్చటం లేదని ఆయన విమర్శించారు. విభజన హామీల సాధన కోసం ప్రతిపక్షాలను కేంద్రం దగ్గరకు కేసీఆర్ తీసుకెళ్ళాలని శ్రీధర్బాబు డిమాండ్ చేశారు.