లాఠీ మాత్రమే కాఠిన్యం... మనసు మాత్రం లావణ్యం
స్త్రీ మనసు మరో స్త్రీకే అర్థమవుతుంది. అలాగే తల్లి మనసు కూడా మరో తల్లికే అర్థమవుతుంది. అందుకే తన జీవనయాత్రలో పోరుబాట సాగిస్తోన్న ఓ మగువ జీవిత పరీక్షలో నెగ్గేందుకు తోడుగా నిలిచే ఉపాధి పరీక్షకు హాజరైంది. ఆ సమయంలో తన చిన్నారిని చూసుకోవడానికి ఎవరూ లేరని బాధపడుతున్నతరుణంలో మరో అమ్మ ముందుకు వచ్చింది. ప్రశాంతంగా పరీక్ష రాసిరమ్మని భరోసానిచ్చింది.. అది ముగిసేంతవరకు ఆ బుజ్జాయికి తానే తల్లైంది. ఆలనా పాలనా చూసింది. అంతేకాదు.. ఈ రెండింటితోపాటు తన విధినిర్వహణ కూడా ఒకేసారి చేసింది. ఇప్పడు అందరిచేత ప్రశంసలు అందుకుంటోంది.

లక్ష్యం దిశగా అడుగులు వేయాలని..
ఓవైపు ఉద్యోగం సాధించాలనే తపన.. మరోవైపు కుటుంబ బాధ్యతలు. ఈ రెండింటితో ఎంతోమంది యువతులు, మహిళలు లక్ష్యం సాధించే దిశగా అడుగులు వేస్తారు. చాలా సందర్భాల్లో అలాంటి వారికి ఇబ్బందులు ఎదురైనా.. కొన్ని సందర్భాల్లో మాత్రం అవతలి వ్యక్తులు వారి పాలిట దేవుళ్లలా మారతారు. తాజాగా ఇలాంటి ఘటనే హైదరాబాద్ నగరంలో జరిగింది.

చిన్నారికి తానే తల్లైన సీఐ
హైదరాబాద్ నగరంలో పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల కోసం ప్రిలిమినరీ రాత పరీక్ష జరిగింది. ఈ పరీక్షకు చిన్న పిల్లాడితో ఓ తల్లి హాజరైంది. కానీ.. పిల్లాడిని చూసుకునేందుకు ఎవరూ లేరు. ఇది గమనించిన సుల్తాన్ బజార్ సీఐ పద్మ.. ఆ పిల్లాడిని దగ్గరకు తీసుకుంది. పిల్లాడి తల్లిని పరీక్షకు పంపి.. సీఐ పద్మ చిన్నారిని ఆడించింది. చిన్నారితో ఫొటో దిగింది.

ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు
'అమ్మ పరీక్ష హాల్లో.. నేను పోలీస్ ఫ్రెండ్స్ తో' అని క్యాప్షన్ పెట్టి ట్వీట్ చేసింది. కానిస్టేబుల్ పరీక్షలో భాగంగా ఒక తల్లి పరీక్ష రాస్తుంటే.. పిల్లాడిని తన ఒడిలో క్షేమంగా చూసుకున్నానని వెల్లడించింది. సీఐ పద్మ చేసిన పనిని పోలీస్ ఉన్నతాధికారులు ప్రశంసించారు. ఓ తల్లి మనసు.. ఇంకో తల్లికే తెలుస్తుందని కామెంట్స్ చేస్తున్నారు. అడిషనల్ డీజీపీ స్వాతీలక్రా.. సుల్తాన్ బజార్ సీఐ పద్మను అభినందించారు. కేవలం పోలీస్ ఆఫీసర్లే కాదు.. నెటిజన్లు కూడా సీఐ పద్మపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. కొంతమంది పోలీసులు అధికారాన్ని దుర్వినియోగం చేసే ఈ రోజుల్లో.. పద్మ లాంటి ఆఫీసర్లు ఉండటం అరుదు అని కామెంట్స్ చేస్తున్నారు. ఓవైపు విధులు నిర్వర్తిస్తూనే.. మరోవైపు ఇలాంటి పనులు చేయడం గ్రేట్ అంటూ కొనియాడుతున్నారు.












Click it and Unblock the Notifications