కొత్త రేషన్ కార్డులు.. 10 రోజుల్లో సీఎంకు నివేదిక: మంత్రి గంగుల
తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డుల విధివిధానాలు.. కొత్త కార్డుల జారీపై పదిరోజుల్లో నివేదిక ఇస్తామని మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు. రాష్ట్రంలో రేషన్ కార్డుల కోసం 4 లక్షల 97 వేల మంది దరఖాస్తు చేసుకోగా వీరికి కార్డుల జారీ అంశం పెండింగ్లో ఉంది. అర్హులకు వెంటనే రేషన్ కార్డులను మంజూరు చేయాలని మూడు రోజుల క్రితం సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ నిర్ణయించిన సంగతి తెలిసిందే.
విధివిధానాలు ఇంకా ఖరారు కాలేదు. దీనిపై సోమవారం బీఆర్కే భవన్ లో క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశమై చర్చించింది. సమావేశం అనంతరం మాట్లాడిన సివిల్ సప్లై శాఖ మంత్రి గంగుల కమలాకర్.. త్వరలోనే విధివిధానాలపై నివేదిక ఇస్తామన్నారు. క్యాబినెట్లో సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం ప్రకారం రేషన్ కార్డులపై క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశమై చర్చించామని.. 10 రోజుల్లో దీనిపై సీఎం కేసీఆర్ కు తుది నివేదిక ఇస్తామన్నారు.
రేషన్ కార్డులో మార్పులు చేర్పులపై కూడా సీఎం కేసీఆర్కు నివేదిక ఇస్తామని తెలిపారు. రేషన్ కార్డులో పేర్ల ఆడిషన్, డిలీషన్ పై కూడా ఈరోజు సబ్ కమిటీ చర్చిందని.. వీటి అన్నింటిపై సీఎంకు నివేదిక ఇస్తామన్నారు. రేషన్ డీలర్లకు కమిషన్ పెంచాలని ఎప్పటి నుండో అడుగుతున్నారని దానిపై కూడా త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. స్మార్ట్ రేషన్ కార్డులు ఇచ్చే అంశంపై కూడా సీఎంకు ప్రతిపాదిస్తామని, అలానే 1498 రేషన్ షాపూలు ఖాళీగా ఉండగా దీనిపై కూడా నివేదిక ఇస్తామన్నారు.