బండి సంజయ్ అరెస్టును తట్టుకోలేక -బీజేపీ ఆఫీసు ముందు ఒంటికి నిప్పు -యువకుడి కలకలం
హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయం ఎదుట అనూహ్య ఘటన చోటుచేసుకుంది. బీజేపీ కార్యకర్తనని చెప్పుకుంటోన్న ఓ యువకుడు పెట్రోల్ తో ఒంటికి నిప్పటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆదివారం మధ్యాహ్నం ఈ సంఘటన జరిగింది. అక్కడున్న పార్టీ శ్రేణులు, పోలీసులు సకాలంలో స్పందించి, మంటలు ఆర్పి యువకుణ్ని ఆస్పత్రి తీసుకెళ్లారు. వివరాల్లోకి వెళితే..
దుబ్బాక ఉప ఎన్నికల సందర్భంగా నోట్ల కట్టలు పట్టుపడిన సందర్భంలో నిరసన కోసం ప్రయత్నించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను పోలీసులు అరెస్టు చేయడం తెలిసిందే. నాటి ఘటనను తట్టుకోలేకపోయానంటూ శ్రీనివాస్ అనే యువకుడు ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. దాంతో తీవ్రంగా మంటలు చెలరేగాయి. అక్కడివాళ్లు స్పందించి శ్రీనివాస్ పై నీళ్లు చల్లి మంటలు ఆర్పారు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు.
శ్రీనివాస్ సొంతూరు రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తమ్మలోని గూడెం. 40 శాతం కాలిన గాయాలతో ప్రస్తుతం అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
బండి సంజయ్ అరెస్ట్ అయిన రోజున తనకు జ్వరంగా ఉందని, అందుకే ఇవాళ వచ్చి ఆత్మాహుతి చేసుకోవాలనుకున్నానని శ్రీనివాస్ తెలిపాడు. బండి సంజయ్ కోసం, అరవింద్ కోసం, రఘనందన్ కోసం ఏంచేయడానికైనా సిద్ధంగా ఉన్నాని, బీజేపీ నేతలను సీఎం కేసీఆర్ ఏమీ చేయలేరని శ్రీనివాస్ కాలిన గాయాలతోనే నినాదాలు చేశాడు.